మామిళ్లగూడెం, ఏప్రిల్ 18: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని ఖమ్మం సీపీ సునీల్దత్ ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రజలు తమ ఓటు హకును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాలో మోహరించిన కేంద్ర పోలీసు బలగాలతోపాటు స్ధానిక పోలీసులు చెక్పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో గురువారం నాటి తనిఖీల వివరాలు, ఇతర అంశాలను ఓ ప్రకటన ద్వారా వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్టమైన చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరాత్రా సొత్తును సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్ల కూడదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే సంబంధిత పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 15 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్, 10 ఇంటర్ స్టేట్, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా 24×7 పటిష్ట నిఘా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రాత్రి 10:30 నుంచి 11గంటల్లోపు కచ్చితంగా వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించడం, రాత్రి వేళల్లో సమయానికి మించి షాపులు తెరిచి ఉంచడం, పుట్టిన రోజు వేడుకల పేరుతో నడి రోడ్లపై వాహనాలు అడ్డం పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటివి చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. రాత్రివేళలో వీధుల్లో సంచరించడం, ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు దిగడం, ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే వారి హిస్టరీ షీట్లపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.