ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 28: విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యవేక్షణ చేస్తున్నది. షెడ్యూల్ ప్రకారం మండలాలు, పాఠశాలలు, సబ్జెక్ట్ల వారీగా ఖాళీల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటించారు. ఈ నెల 28నుంచి 30వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. సోమవారంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుండడంతో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరమైన లోపాలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా డీఈవో చర్యలు తీసుకుంటున్నారు.
విద్యాశాఖ పరిధిలో బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేసుకునే దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి అదేరోజు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని అన్ని మండలాల విద్యాధికారులకు డీఈవో సోమశేఖరశర్మ ఆదేశాలు జారీ చేశారు. సబ్జెక్ట్ల వారీగా వచ్చే దరఖాస్తులకు జత చేసిన పత్రాలను నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. బదిలీల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను పాటిస్తూ విధులు నిర్వహించాలని ఎంఈఓలకు సూచించారు.
తొలిరోజు 899 దరఖాస్తులు
తొలిరోజు 899 దరఖాస్తులు వచ్చాయి. బదిలీలకు సంబంధించి ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు ఇలా అన్ని రకాలు వారికి బదిలీలు వర్తించనున్నాయి. 2023 పిబ్రవరి 1 నాటికి 2 సంవత్సరాలు పూర్తయిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరి 1 నాటికి ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ చేయబడతారు. వీరితోపాటు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో బదిలీలకు దరఖాస్తులు భారీగా రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సందేహాల నివృత్తికి ఆర్పీల నియామకం
బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు దరఖాస్తులను సైతం ఆన్లైన్ విధానంలో తీసుకోనుండడంతో కొందరి ఉపాధ్యాయులకు కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ చేయడంతో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు విద్యాశాఖాధికారి రిసోర్స్ పర్సన్స్ను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, సందేహాల నివృత్తికి దేవేందర్, నందకిశోర్, శ్రీనివాస్, కిశోర్ను నియమించారు. ఫోన్ ద్వారా 9705319920, 9848098992 సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి ఎస్ఏల పదోన్నతికి ఎస్ఆర్ల పరిశీలన
ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పదోన్నతి కోసం సీనియార్టీ జాబితా విడుదల చేశారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులకు పాత డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 29 నుంచి 31వరకు జరిగే కౌన్సెలింగ్లో జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు హాజరుకావాలని సూచించారు. అర్హత సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిష్టర్తోపాటు చెక్ లిస్ట్ను పరిశీలించనున్నారు. పర్యవేక్షణకు అధికారులను ఏర్పాటు చేశారు. చెక్లిస్ట్ పరిశీలించేందుకు 11 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ఒక హెడ్మాస్టర్, ఒకరు సీనియర్/జూనియర్ అసిస్టెంట్, మరొకరు కంప్యూటర్ను కేటాయించారు. మొత్తం ప్రక్రియను ఏడీ వెంకటేశ్వరచారి పర్యవేక్షిస్తుండగా, సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, శ్రీధర్బాబు సబ్జెక్ట్ల సీనియార్టీ లిస్ట్ను పరిశీలించనున్నారు. జీఎస్ ప్రసాదరావు ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ల సీనియార్టీ లిస్ట్లను పర్యవేక్షించనున్నారు.