Salary | ఖమ్మం, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పర్మినెంట్ లెక్చరర్ల మాదిరిగానే విధుల నిర్వహణ.. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ సంతృప్తి చెందుతున్నా.. సక్రమంగా వేతనాలు అందక సతమతమవుతున్నారు. నెలనెలా వేతనాలు అందితేనే కష్టంగా కుటుంబాలను వెళ్లదీసే ఈ రోజుల్లో రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు తీరుతాయని, తామూ రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే ప్రతి నెల జీతాలు తీసుకుందామంటే అది కలగానే మిగిలియింది.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లతరబడి పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను అర్హతలనుబట్టి క్రమబద్ధీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. నెట్, స్లెట్ ఉండి పీహెచ్డీ కలిగిన వారిని పర్మినెంట్ చేసింది. ఇలా చేసినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా అతి తక్కువ మంది పర్మినెంట్ కాకుండా మిగిలిపోయారు. అయితే వీరికి ప్రస్తుత ప్రభుత్వం జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల పూర్తయి రెండో నెల గడుస్తున్నా పెండింగ్ వేతనాలు విడుదల చేయకపోవడంతోపాటు జీతాల చెల్లింపు విషయంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో దిగులు చెందుతున్నారు.
రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపు విషయంలో ఆలస్యం జరుగుతున్నది. బాధ్యతగా పని చేస్తున్నా జీతం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. నవంబర్, డిసెంబర్ నెలల వేతనాల అంశంపై ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకుందామన్నా ఎవరిని కలిస్తే ఏమవుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ పాఠాలు బోధిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిల్ల్లో 28 మంది వివిధ సబ్జెక్ట్ల్లో పాఠాలు బోధిస్తూ ఒప్పంద అధ్యాపకులుగా ఏళ్లుగా పనిస్తున్నారు. సత్తుపల్లి కళాశాలలో ఆరుగురు, ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో ఆరుగురు, ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ముగ్గురు, భద్రాచలంలో నలుగురు, కొత్తగూడెంలో ఇద్దరు, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు తదితర కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున కాంట్రాక్ట్ లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.
రెగ్యులర్ అధ్యాపకులతోపాటే ప్రతి నెల వేతనాలు చెల్లించాలి. మహిళా అధ్యాపకుల సెలవుల విషయంలో చాలా సమస్యలున్నాయి. పదిహేను సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నా. వేతనాలు సకాలంలో అందిస్త్తూ మా గౌరవానికి భంగం కలుగకుండా అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి.
జీతాలు సకాలంలో అందకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నెలనెలా వేతనాలు చెల్లించడంతోపాటు కొంత వెసులుబాటు కల్పించి కండీషన్పై మిగిలిన ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వం వేసవి సెలవులతో ముడిపెట్టకుండా 12 నెలల సమయానికి జీతాలు చెల్లించాలి.