మనకూ మన ముందు తరాలకు జల వనరులు ఎంతో అవసరం.. ఇప్పుడు అవకాశం దొరికిందని అవసరానికి మించి జలాలు వినియోగిస్తే మున్ముందు భూగర్భజలాలు ఇంకిపోవడం ఖాయం. కాబట్టి ‘జల నిధులను’ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ ప్రాధాన్యాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. ఇక నుంచి రోజుకు 25 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, అపార్ట్మెంట్ల నిర్వాహకులకు సెస్ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో జీవో జారీ చేసింది. ఈ క్రమంలో ఫ్లో మీటర్ల బిగింపునకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వినియోగమూ పెరుగుతున్నది. ఇదే అదునుగా భావించి నీటిని వ్యాపార వస్తువుగా మార్చి కొందరు వ్యాపారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన బోర్లు వేసి నీటిని తోడుతున్నారు. జల వనరులు పుష్కలంగా ఉన్నాయని నీటిని వృథా చేస్తే మున్ముందు భూగర్భ జలాలు ఇంకిపోవడం ఖాయం. అవసరానికి తగినట్లుగా నీటిని ఫర్వాలేదు గానీ కొందరికీ నీటి వృథాపై ఎలాంటి పట్టింపు ఉండదు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో నీటి వృథా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే పెద్ద అపార్ట్మెంట్లు, సముదాయాలు, ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లలో పెద్ద మొత్తంలో నీటి వాడకం జరుగుతుంది. ఇలా రోజుకు వేలకు వేల లీటర్ల నీటిని ఇబ్బడిముబ్బడిగా వృథా చేస్తే కొన్నిరోజులకు భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ప్లాన్ వేసింది. భూగర్భం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టుకు లెక్క ఉండాల్సిందేనని, ఇక నుంచి రోజుకు 25 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, అపార్ట్మెంట్ల నిర్వాహకులకు సెస్ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో జీవో జారీ చేసింది.
మోటర్లకు ఫ్లోమీటర్స్..
నీటి వృథాను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఇక నుంచి భారీ వెంచర్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో వినియోగించే మోటర్లకు ఫ్లోమీటర్లు బిగించనున్నది. మీటర్ల ద్వారా ఏ సంస్థ, ఏ యాజమాన్యం ఎక్కువ నీటిని వినియోగిస్తుందన్న విషయం సర్కార్కు తెలుస్తుంది. మరోవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాంట్లు ఏర్పాటు చేసిన వారిపై కొరడా ఝుళిపించనున్నది
వీటికి మినహాయింపు..
సెస్ విధింపులో గృహాలు, చిన్న అపార్ట్మెంట్లు, ఆర్మ్డ్ ఫోర్స్, వ్యవసాయ కమతాలు, సర్కార్ నిర్మించిన వాటర్ ట్యాంక్లు, పబ్లిక్ నల్లాలకు మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ జీవో అమలు చేసేందుకు భూగర్భశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పరిశ్రమలు, కమర్షియల్ వాటర్ సైప్లె, హౌసింగ్ సొసైటీలతోపాటు ఇతరత్రా వ్యాపార సంస్థల్లో ఫ్లోమీటర్లు బిగించనున్నారు.
జిల్లాలో 79 ఫిజోమీటర్లు..
జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని తెలుసుకునేందుకు ఆ శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా 79 ఫిజోమీటర్లు ఏర్పాటు చేశారు. మీటర్ల ద్వారా ఆరు గంటలకు ఒకసారి జలాల స్థాయి తెలుస్తుంది. గతేడాది మే నెలలో జిల్లావ్యాప్తంగా సగటున భూగర్భజలాలు అందేలోతు 9.52 మీటర్లు ఉండగా ఈ ఏడాది మే నెలలో జలాలు 9.85 మీటర్లకు పెరిగింది. 0.47 శాతం లోతుస్థాయి తగ్గినా ప్రస్తుతానికి భూగర్భజలాలకు కొదువ లేదు. గుండాల మండలంలో కేవలం 2.62 మీటర్ల లోతు, అశ్వారావుపేటలో 42.6 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి.
ఈ మండలాల్లో అతి వాడకం..
జిల్లాలోని దమ్మపేట, చుంచుపల్లి (రోజుకు 90శాతం) మండలాల్లో ప్రమాదకర స్థాయిలో నీటి వాడకం జరుగుతున్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఆ తర్వాతి స్థానంలో సుజాతనగర్, మణుగూరు (రోజుకు 70శాతం) మండలాలు ఉన్నాయి. జిల్లాలో అతి తక్కువగా నీటి వినియోగం నమోదైన మండలం ఆళ్లపల్లి. ఈ మండలంలో రోజుకు నీటి వినియోగం 6శాతం మాత్రమే. గతంలో ఎవరు ఎక్కడ బోర్లు వేసినా స్థానిక అధికారుల నుంచి అనుమతులు తీసుకునే వారు. ఇక నుంచి భూగర్భశాఖ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది. నీటి వినియోగాన్ని విజిలెన్స్ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే అదనపు కలెక్టర్, డీఎస్పీ, డీఆర్డీవో, భూగర్భ జల వనరులశాఖ అధికారులు, తహసీల్దార్, ఎస్సైలు సైతం నీటి వినియోగాన్ని తనిఖీ చేసేందుకు వీలుగా సర్కార్ పవర్స్ ఇచ్చింది.
సెస్ వసూలు ఇలా..
జిల్లావ్యాప్తంగా 35 వేల బోర్లు ఉన్నాయి. వినియోగదారులు రోజుకు 25 వేల లీటర్ల వరకు ఉచితంగా వినియోగించవచ్చు. 26 నుంచి 50 వేల లీటర్ల వరకు వినియోగించుకుంటే ప్రతి వెయ్యి లీటర్లకు ఒక రూపాయి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. 50 వేల లీటర్లు దాటితే ఒక లీటరుకు రూ.2 చొప్పున సెస్ చెల్లించాలి. సెమీ క్రిటికల్, క్రిటికల్, డ్రింకింగ్ వాటర్ యూనిట్ల వారీగా సెస్ వసూలు ఉంటుంది.
నీటి వృథాను తగ్గించాలి..
పరిమితికి మించి భూగర్భజలాలను వినియోగించే కంపెనీలు, పరిశ్రమలు, పెద్ద అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాలకు సెస్ విధించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో జీవో విడుదల చేసింది. మాశాఖ అధికారులు రంగంలోకి దిగి నీటిని ఎక్కువగా వినియోగించే సంస్థలను గుర్తించనున్నారు. వారి వ్యాపార ప్రాంతాల్లోని మోటర్లకు ఫ్లోమీటర్లు బిగించనున్నారు. ఆయా సంస్థలు స్వచ్ఛందంగా నీటి వినియోగం తగ్గిస్తే సెస్ను తప్పించుకోవచ్చు.
– ఎం.బాలు, జిల్లా భూగర్భశాఖ అధికారి, కొత్తగూడెం