రెండు జిల్లాలు.. చేనులూ చెలకలు.. చుట్టరికాలు అనుబంధాలు.. రాకపోకలకు మధ్య ఆకేరు.. ఏటిలో నీరు లేనప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలో అవతల గట్టుకు. ఇవతల గట్టుకు. కానీ ఎక్కా రాయి.. దిగా రాయి.. ఏరు పొంగిందా ఇక 50-60 కిలోమీటర్ల దూరాభారం. ప్రయాణ ఖర్చుల ఆర్థిక భారం. వానకాలంలో ఏరు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుని పోయి ప్రాణాలొదిలిన వారెందరో ఉన్నారు. ఇది ప్రయాణికుల దశాబ్దాల బాధ. ఒక్క బ్రిడ్జి ఇప్పుడు రెండు జిల్లాలను కలుపనున్నది. ఇరు జిల్లాల బాంధవ్యాలను మరింత దగ్గర చేయనున్నది. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రిడ్జి ఆజ్మీరాతండాలో అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల కష్టాలకు పరిష్కారం చూపనున్నది.
తిరుమలాయపాలెం, నవంబర్ 1: ప్రయాణికుల కల నెరవేరింది. ఆజ్మీరాతండాలోని ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. బ్రిడ్జికి ఇవతల వైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం, అవతల వైపు మహబూబాబాద్ జిల్లాలోని రాకాశితండా. ఏరుపై బ్రిడ్జి నిర్మిస్తే ఐదు నిమిషాల్లో అవతల నుంచి ఇవతలకు, ఇవతల నుంచి అవతలకు చేరుకోవచ్చు. బ్రిడ్జి నిర్మించకముందు ప్రయాణికులు ఆకేరు నుంచే ప్రయాణం సాగించేవారు. ఏరు జోరుగా ప్రవహిస్తే ప్రయాణం ఆపుకోక తప్పదు. లేదంటే చుట్టూ తిరిగి వాహనాలు ఎక్కి 50-60 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందే. ఏరు దాటే క్రమంలో ఎంతోమంది మృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రయాణం ఇలా ప్రహసనమే.
రూ.15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం..
పాలేరు ఉప ఎన్నిక సమయంలో శాసనసభ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు ఆకేరుపై బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2017 డిసెంబర్లో 10న మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వరరావు ఆజ్మీరాతండా ఆకేరు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.15 కోట్ల నిధులు విడుదల చేయించారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీంతో రాకాశితండా, చిలక్కొయలపాడు, సీరోలు, కామెపల్లి, ఆజ్మీరాతండా, తిప్పారెడ్డిగూడెం, పాతర్లపాడు తదితర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
బ్రిడ్జీ నిర్మాణంతో ఇబ్బందులు తప్పాయి..
ఆకేరుపై బ్రిడ్జి నిర్మించడంతో ప్రయాణికుల బాధలు తప్పాయి. గతంలో ఏరు దాటుతూ ఎంతో మంది మృత్యువాత పడ్డారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఖమ్మం, మానుకోట జిల్లాలకు రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రయాణికుల కష్టాలు తీరతాయి. ఇప్పుడు రైతులు, కూలీలకు రహదారి సమస్య తీరింది.
– ఆజ్మీరా రమేశ్, గ్రామస్తుడు, ఆజ్మీరాతండా, ఖమ్మం జిల్లా
ప్రయాణికులకు మేలు..
ఆకేరుపై బ్రిడ్జీ నిర్మించడం హర్షణీయం. మేము ఆకేరు అవతలి ఒడ్డున ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే 50-60 కిలోమీటర్లు ప్రయాణించాలి. పైగా ప్రయాణ ఖర్చుల భారం. బ్రిడ్జి నిర్మాణంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే అవతలి ఒడ్డు గ్రామాలకు చేరుకోవచ్చు. బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లాలకు చెందిన ప్రజల కష్టాలు తీరాయి.
– వెంకటేశ్వర్లు, గ్రామస్తుడు, చిలుక్కోయలపాడు, డోర్నకల్ మండలం, మానుకోట జిల్లా