చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి, మే 11: అడవుల సంరక్షణ సామాజిక బాధ్యత అని పీసీసీఎఫ్ (హెచ్వోఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ అడవులను రక్షించాలని కోరారు. ములకలపల్లి మండలం కమలాపురంలో గురువారం పర్యటించిన ఆయన అక్కడ 45 హెక్టార్లలో పెంచిన ప్లాంటేషన్ను పరిశీలించారు. ములకలపల్లిలో నూతనంగా నిర్మించిన డిప్యూటీ ఆర్వో క్వార్టర్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా పోడు నరికితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అటవీ జంతువులను వేటాడే సంస్కృతిని విడిచిపెట్టాలని సూచించారు.
అడవుల అభివృద్ధికి పటిష్ట చర్యలు
అడవుల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని పీసీసీఎఫ్ డోబ్రియల్ ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లిలో గురువారం పర్యటించిన ఆయన.. అబ్బుగూడెంలో 450 హెక్టార్లలో చేపట్టిన ఫారెస్ట్ ప్లాంటేషన్ను, నర్సరీని, మర్రిగూడెంలో 80 హెక్టార్లలో ఏర్పాటు చేసిన పల్లె పశువు వనాన్ని, అడవిలో జంతువులకు ఏర్పాటు చేసిన నీటి వసతులను పరిశీలించారు. అడవుల అభివృద్ధికి, అటవీ జంతువుల సంరక్షణకు చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవులను విరివిరిగా పెంచాలని, నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.