కూసుమంచి, డిసెంబర్ 3: సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై విజయం సాధించారు. నవండర్ 30న జరిగిన ఎన్నికల్లో ప్రజలు 2,36,287 మంది ఓటర్లలో 2,15,969 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1,27,820 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కందాళ ఉపేందర్రెడ్డికి 71,170 ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం 5,308 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి ఈ తరహాలో ఓట్లు వస్తాయని ఎవ్వరూ ఊహించని రీతిలో కాంగ్రెస్కు ఓట్లు వచ్చాయి. పాలేరు నియోజకవర్గంలో 2,15,969 ఓట్లు పోల్ అవ్వగా 59.18 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డికి 32.95 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం 2.45 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి తమ్మినేనికి డిపాజిట్ దక్కలేదు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో 21 రౌండ్లలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు.