భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ప్రజా పాలనకు జనం నుంచి స్పందన అంతగా కనిపించలేదు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజల సమస్యలకు అధికారులు సమాధానం చెప్పడం తప్ప పూర్తిస్థాయి పరిష్కారం చూపించలేదు. చుంచుపల్లి మండలం ఎన్కే నగర్లో జరిగిన ప్రజా పాలనకు వచ్చిన దరఖాస్తుదారు గత ఏడాది నుంచి రేషన్ రావడం లేదని, పాత కార్డు నెంబర్ చెల్లుతుందా.. లేదా.. అని అడగ్గా.. నెంబర్ వేయండి.. తర్వాత ఆన్లైన్లో సరిచేసుకోవాలి అధికారులు చెప్పారు. దీంతో దరఖాస్తు ఇచ్చిన సదరు మహిళ ఆందోళనగానే ఇంటికి వెళ్లింది. సుజాతనగర్ మండలం కోమటిపల్లికి చెందిన ఓ రైతు నేను పొలం కౌలుకు చేసుకుంటున్నాను.. నాకు ఆ రైతు పొలం సర్వే నెంబర్ తెలియదు.. దరఖాస్తులో ఎలా వేయాలని అడిగారు.. దీంతో అధికారుల నుంచి సమాధానం రాలేదు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ప్రతి గ్రామంలో ప్రజలకు సందేహాలు తలెత్తడంతో వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. గ్యాస్ కార్డులో కుటుంబ యజమాని పేరుతో ఉంది.. దీనిపై సబ్సిడీ వస్తుందా.. అని కౌంటర్ వద్ద ప్రశ్నించగా.. దీనికి వారు సమాధానం చెప్పలేకపోతున్నారు.
ప్రజా పాలన గ్రామసభల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పరిశీలించారు. కొత్తగూడెంలో కూనంనేని, ఇల్లెందులో కోరం కనకయ్య, అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు పరిశీలించారు. ఆశ్వాపురం మండలం అమెర్దాలో అదనపు కలెక్టర్ రాంబాబు, చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాకు తెల్ల కార్డున్నా బియ్యం రావడం లేదు. ఈ కార్డు నెంబర్ వేస్తే నాకు పథకాలు వస్తాయా.. రావా.. తెలియడం లేదు. ఆన్లైన్ చేసుకోవాలని చెప్పారు. చాలా సార్లు తిరిగినా ఆన్లైన్లో చూపించడం లేదు. నాకు ఐదు గ్యారెంటీలు వస్తాయా.. రావా. ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. దరఖాస్తు ఇస్తే తీసుకుని రశీదు ఇచ్చారు. కొత్త కార్డు కావాలంటే ఈ దరఖాస్తులో ఎక్కడ రాయాలో కాలం ఇవ్వలేదు.