భద్రాచలం, ఏప్రిల్ 15 : భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా వచ్చే భక్తులు మెచ్చేలా సకల ఏర్పాట్లు చేస్తున్నామని సమాచార, పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భద్రాచలం వచ్చిన ఆయన మిథిలా స్టేడియంలో రామయ్య కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా సీతారాముల కల్యాణం జరిగే పవిత్ర పుణ్యస్థలం భద్రాచలమని అన్నారు. శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేస్తున్నామన్నారు. స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశామని, ప్రతి సెక్టార్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల సౌక ర్యం కోసం ఆన్లైన్లో టికెట్లు, వసతి గదుల కోసం https://bhadradrit emple.telangana.gov.in వెబ్సైట్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం ఇటీవల భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయిన డీపీఆర్వో శ్రీనివాస్ కమిషనర్ను శాలువాతో ఘనంగా సత్కరించి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఈఈ రవీందర్రాజు, ఏఈవో శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.