సారపాక/భద్రాచలం, ఏప్రిల్ 16 : భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మధ్యాహ్నం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. అంతకుముందు ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఖమ్మం జిల్లా సరిహద్దులో సీఎస్కు ఘన స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. అతిథి గృహానికి చేరుకున్న సీఎస్ శాంతికుమారికి సమాచార, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం సీఎస్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను బుధవారం ఆమె స్వామివారికి సమర్పించనున్నారు.