ఖమ్మం : ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన ఈ-ఆఫీస్ ఫైలింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆఫీస్ అమలు పరిచేందకు ఫైలింగ్ విధానంపై సందేహాలను నివృత్తి చేసుకుని ఇక నుంచి ఈ-ఆఫీస్ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ-ఫైలింగ్పై శిక్షణ పొందిన అధికారులు సిబ్బంది మిగతా సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించి కార్యాలయపు ఉత్తర ప్రత్యుత్తరాలు, రికార్డుల నిర్వాహణ జరగాలని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఈ ఫైలింగ్ విధానం ద్వారా ఫైలింగ్ చేయాలని కార్యాలయపు పర్యవేక్షకులను ఆదేశించి స్వయంగా ఈ-ఫైలింగ్ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పలు మండలాల్లోని పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థల సేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఇంకా బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాల సేకరణ సత్వరమే గుర్తించి వనాలు ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యాక్రమంలో ఏపీడీ శిరీష, పర్యవేక్షకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.