ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 8: విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ మౌలిక వసతుల కేంద్రంలో ఎంఈవో, తొలిమెట్టు నోడల్ అధికారులు, హెచ్ఎంలతో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలతోపాటు తరగతికి సంబంధించిన అభ్యాసన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు.
చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోని ప్రాథమిక అభ్యాసన వైపు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితర ఇన్పుట్లన్నీ ఉన్నట్లు ఫలితం రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా తరగతిలోని ప్రతి విద్యార్థి లక్ష్యం మేరకు ప్రగతి సాధనకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం నియోజకవర్గంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈవో ఎం శ్రీనివాస్, ఏఎంవో రవికుమార్, ఎంఐఎస్ సీహెచ్ రామకృష్ణ, తొలిమెట్టు నోడల్ అధికారులు పాల్గొన్నారు.