మామిళ్లగూడెం, జూన్ 14 : జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణ పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ అవసరం మేరకు భూ సేకరణ చేపట్టాలని సూచించారు. మూడో రైల్వే లైన్కు సంబంధించి జిల్లాలో 59.17 హెక్టార్ల భూ సేకరణ జరపాల్సి ఉండగా.. 54.28 హెక్టార్లకు అవార్డ్ పాస్ చేసి.. స్వాధీనం చేసుకున్న భూమిని రైల్వే శాఖకు అప్పగించినట్లు తెలిపారు. మిగులు 4.11 హెక్టార్లకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. డోర్నకల్ జంక్షన్-భద్రాచలం రోడ్ జంక్షన్ల మధ్య రైల్వే డబ్లింగ్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి సింగరేణి మండలం కమలాపురం, పోచారం, సింగరేణి, కారేపల్లి, కోమట్లగూడెం, రేలకాయలపల్లి గ్రామాల్లో 57.045 ఎకరాల భూ సేకరణకు జేఎంఎస్ సర్వే ప్రక్రియ చేపట్టి పీఎన్ పబ్లిష్ చేయాలన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి, చింతకాని మండలం బస్వాపురం, నాగులవంచ, పాతర్లపాడు, ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం వద్ద ఆర్వోబీ నిర్మాణాలకు భూ సేకరణ చేసి రైల్వేకు అప్పగించాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్యాకేజీ-1 కొరకు జిల్లాలో 548.08 ఎకరాల భూ సేకరణకు 507.2925 ఎకరాలకు అవార్డ్ పాస్ కాగా.. రూ.144.84 కోట్లు భూ నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఇదే ప్రాజెక్ట్ ప్యాకేజీ-2 కింద 424.19 ఎకరాల భూసేకరణకు.. 407.0450 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి.. ఇప్పటివరకు రూ.98.34 కోట్లు పరిహారం చెల్లించామని, ఇంకా 17.1450 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ప్యాకేజీ-3 కింద 383.3325 ఎకరాల భూ సేకరణకు.. 371.1200 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి.. రైతుల ఖాతాల్లో రూ.88.94 కోట్లు జమ చేశామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(పాలేరు లింక్ కెనాల్) కింద ఏనూరు, కామేపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో 1717.34 ఎకరాల భూ సేకరణకు.. 1569.39 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి.. ఇప్పటివరకు భూ పరిహారం కింద రూ.93.39 కోట్లు, నిర్మాణాల పరిహారం కింద రూ.7.30 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(సత్తుపల్లి ట్రంక్ కెనాల్) కింద 330.15 ఎకరాల భూసేకరణకు.. 325.30 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి.. రూ.19.59 కోట్లు పరిహారం కింద విడుదల చేసినట్లు తెలిపారు. ఏనూరు వద్ద 18ఎల్ కెనాల్, బుగ్గవాగు ప్రాజెక్ట్ల కోసం భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ కొరకు 190.16 ఎకరాల భూసేకరణ ప్రక్రియకు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, ఆర్డీవోలు జి.గణేశ్, ఎల్.రాజేందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, మైనింగ్ ఏడీ సాయినాథ్, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, మున్సిపల్, రైల్వే శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.