కొణిజర్ల, అక్టోబర్ 21: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ నావల్జిత్ కపూర్ ఆకాంక్షించారు. మండలంలోని తనికెళ్ల ఏకలవ్య మోడల్ స్కూల్ను శుక్రవారం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ పీవో పొట్రు గౌతమ్తో కలిసి సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో సదుపాయాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలను సొంత భవనంలోకి మారుస్తామని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఐఏఎస్లు యాజమాన్యానికి సూచించారు. విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ బోధించడం హర్షణీయమన్నారు. అనంతరం నూతన భవనాల నిర్మాణంపై సమీక్షించారు. పర్యటనలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ కల్యాణ్రెడ్డి, ప్రాంతీయ కో-ఆర్డినేటర్ డేవిడ్రాజు, కృష్ణానాయక్, సత్యానంద్ పాల్గొన్నారు.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తనికెళ్లలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి యాజమాన్యానికి సలహాలు, సూచనలిచ్చారు. కొణిజర్ల జడ్పీహెచ్ఎస్లో రూ.26 లక్షలతో చేపడుతున్న శానిటేషన్, డైనింగ్ హాల్, వాటర్ ట్యాంక్లతో పాటు ఇతర పనులను పరిశీలించారు. వసతులపై విద్యార్థులను ఆరా తీశారు. పాఠశాలలో హాజరు శాతం 85 శాతం ఉందని తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూసీ ఏఈ సురేశ్ ‘మన ఊరు- మన బడి’కి సంబంధించిన అంచనా నివేదికలు ఇవ్వాలని కోరగా ఆయన స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట సర్పంచ్ సూరంపల్లి రామారావు, డీఈవో యాదయ్య, ఎంఈవో శ్యాంసన్, తహసీల్దార్ డి.సైదులు, ఎంపీడీవో ఆర్.రమాదేవి, ఎంపీటీసీ కొనకంచి స్వర్ణలత, ఏఈ సురేశ్, హెచ్ఎం దామాల పుల్లయ్య ఉన్నారు.