మామిళ్లగూడెం, జూన్ 26: ప్రతి ఈవీఎంనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ వీవీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఏ దశలోనూ ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీని (ఫస్ట్ లెవెల్ చెకింగ్), ఈవీఎంలను భద్రపర్చే తీరును జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఈవీఎం గోడౌన్లో సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీని చేపట్టారు. ఈవీఎంల గోడౌన్లోకి వెళ్లి ఈవీఎం బ్యాలెట్ యూనిట్ (బీయూ), కంట్రోలింగ్ యూనిట్ (సీయూ), వీవీ పాట్ యంత్రాలను మొదటి దశలో పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన ఈవీఎంలను వేరుగా భద్రపర్చే విధానాన్ని, భద్రతా సిబ్బంది నిబంధనలను, బ్యారికేడింగ్ విధానాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
నోడల్ అధికారి తనిఖీ
ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారి, డిప్యూటీ సీఈవో ఏ.వెంకటేశ్వరరావు సోమవారం జిల్లాకు వచ్చారు. జిల్లా పరిషత్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను సందర్శించి మొదటి స్థాయి ఈవీఎంల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. చేపడుతున్న తనిఖీ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఏసీపీ వై.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మదన్గోపాల్, రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.