భధ్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి ఫారం-12, ఫారం-12ఏలను శిక్షణ నిర్వహించే కేంద్రాల్లోనే అందిస్తామన్నారు. అదే నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయిస్తే వారు ఈడీని తెలుసుకోవడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం-12ఏలను అందజేయాలన్నారు.
మరో నియోజకవర్గంలో విధులు కేటాయించినైట్లెతే వారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 ద్వారా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు 17సీ ద్వారా, రిజిస్టర్ ఆఫ్ ఓటర్లు వివరాలను 17ఏ ద్వారా తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈడీసీ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. మొదటి శిక్షణ కార్యక్రమానికి కొత్తగూడేనికి 277 మంది, అశ్వారావుపేట 282, ఇల్లెందు 240, పినపాక 270, భద్రాచలంకు 210 మంది.. మొత్తం 1,279 మందికి.. 90 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మాస్టర్ ట్రైనర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్వోలు మధు, ఏఆర్వో కాశయ్య, భూమి కొలతల శాఖ ఏడీ కుసుమకుమారి, ఇరిగేషన్ ఈఈ అర్జున్రావు, తహసీల్దార్లు రవికుమార్, తహసీల్దార్ పుల్లయ్య, తహసీల్దార్ శిరీష పాల్గొన్నారు.