భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 128 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇంఛార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,11,369 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే అంచనాతో ఉన్నామన్నారు.
ఏ గ్రేడ్ ధాన్యం రూ.2,203, బీ గ్రేడ్ రకం రూ.2,183గా మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీన 61, 5న 36,19న 31 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీవో విద్యాచందన, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ త్రినాథ్, పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, డీసీవో ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.