భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం ప్రకటించారు. గత నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను రూపొందించారు. ఊరూరా బూత్ లెవల్ సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల వద్ద చేర్పులు, మార్పులపై దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, బూత్ లెవల్ అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ప్రియాంక ఆల ఓటర్ల జాబితాపై స్పష్టత ఇచ్చారు. గత నెల 19 నుంచి ఇప్పటివరకు 68,703 దరఖాస్తులు రాగా.. వాటిపై విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలోని 1,095 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,45,094 ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో వయసులవారీగా ఓటర్లను కూడా గుర్తించారు.
మహిళా ఓటర్లే ఎక్కువ
ఓటర్ల నమోదులో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నట్లు తేటతెల్లమైంది. జిల్లాలో పురుషులు 4,61,315 మంది ఉండగా.. మహిళలు 4,83,741 మంది ఉన్నారు. ఐదు నియోజకవర్గాల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు 22,096 మంది ఉండగా.. 80 ఏళ్ల పైబడిన వారు 13,082 మంది ఉన్నారు. ఓటర్లతోపాటు ప్రతీ ఎన్నికల్లో ఓట్లు వేసే గణాంకాల్లో కూడా మహిళలే ముందంజలో ఉండడం గమనార్హం. ఇప్పటికే ఎన్నికల పరిశీలకులు బాలమాయాదేవి వారం రోజుల నుంచి అధికారులతో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు.
ఓటు హక్కుపై అవగాహన
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం కోసం దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, వృద్ధుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల నోడల్ అధికారి స్వర్ణలత లెనీనా ఆయా వర్గాల వారికి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. కొత్తగా ఓటు హక్కు తీసుకోవడంపై కూడా అవగాహన కల్పించారు.
జిల్లాలో 9,45,094 ఓటర్లు
కొత్త ఓటర్ల చేర్పులు, మార్పుల తర్వాత తుది జాబితాను ప్రకటించాం. తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఓటరు జాబితాను రూపొందించాం. 1,095 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 698 లొకేషన్లు ఉన్నట్లు గుర్తించాం. కొత్తగా 68,203 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆన్లైన్ చేశాం. చనిపోయిన వారి ఓటును తొలగించి కొత్త వారిని చేర్పించాం.
– కలెక్టర్ ప్రియాంక ఆల