కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 3: భద్రాద్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం కొత్తగూడెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనడం వల్ల జీవితంలో చక్కగా స్థిరపడవచ్చన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
కాగా, 68వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీల్లో టీం చాంపియన్షిప్, వ్యక్తిగత అంశాల్లో ఈ పోటీలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ పోటీల్లో టీం చాంపియన్షిప్ విభాగంలో ఆతిథ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది. బాలుర జట్టు సైతం అద్భుతమైన ప్రతిభకనబర్చి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి వ్యక్తిగత పోటీలను నిర్వహించనున్నారు. డీఈవో వెంకటేశ్వరచారి, ఎస్జీఎఫ్ కార్యదర్శి నరేశ్కుమార్, పోటీల రాష్ట్ర పరిశీలకుడు మామిడి సంతోశ్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బట్టు ప్రేంకుమార్, యనమదల వేణుగోపాల్, లక్ష్మయ్య, శేఖర్, స్టెల్లా, రాము, కవిత, సీతాదేవి, సుజాత, నాగలక్ష్మి పాల్గొన్నారు.