మామిళ్లగూడెం, అక్టోబర్ 11: ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెక్టోరల్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణ సామగ్రి, చేయాల్సిన, చేయకూడని, చెక్ లిస్ట్, హ్యాండ్ బుక్లు పంపిణీ చేశామన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. బుధవారం సంయుక్తంగా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాయని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శన చేయాలని, పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి వసతుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే దృష్టికి తెచ్చి, వసతుల కల్పన పూర్తి చేయాలన్నారు.
యువతతో బూత్ స్థాయి అవేర్ నెస్ బృందాలు ఏర్పాటు చేయాలని, ప్రతి సెక్టార్ పరిధిలో కనీసం 200 మందికి సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేయించి, యాప్పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. గత ఎన్నికల్లో లో టర్న్ ఔట్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు స్వీప్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తెచ్చి, ఓటింగ్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట, పోలింగ్ కేంద్రాలు షిఫ్ట్ అయిన చోట ఓటర్లకు ఈ విషయం తెలిసేలా విసృ్తత ప్రచారం చేయాలన్నారు. కొత్త ఓటర్లు ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా, బిఎల్ఓల ద్వారా ఓటు వివరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం పోలింగ్కు 5 రోజుల ముందు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు, స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్ ఎన్నికల ప్రక్రియపై, పోలింగ్కు ముందు, పోలింగ్ సందర్భంలో, పోలింగ్ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, రిటర్నింగ్ అధికారులు, ఏసీపీలు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, అక్టోబర్ 11: ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ అవసరాలకు తరలించే నగదు తరలింపులో సరైన పత్రాలు లేకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5 తేదీ వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్, నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎకువ మొత్తంలో నగదు దొరికితే ఆ మొత్తం సీజ్ చేసి జిల్లా ట్రెజరీ అధికారుల వద్ద జమ చేస్తారన్నారు. అధికారులకు ఆధారాలుగా లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందన్నారు. సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి నూతన కలెక్టరేట్ మొదటి అంతస్థులోని జిల్లా వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారిణి ఏ. విజయకుమారి కాంటాక్ట్ నెం. 9492104983 సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేరొన్నారు.