భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : బ్యాంకర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.. నిర్దేశించిన రుణ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం ఐడీవోసీ సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాల పురోగతిపై జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రుణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం రూ.5599.30 కోట్ల రుణ లక్ష్యంకాగా.. అందులో ఇప్పటివరకు రూ.4175.83 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు ఆమెకు వివరించారు.
అందులో వ్యవసాయానికి రూ.4309.34 కోట్లకు గాను.. రూ.1923.91 కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రూ.426.55 కోట్లకు గాను.. రూ.377.32 కోట్లు, విద్యా రంగానికి రూ.202.80 కోట్లకు గాను.. రూ.7.45 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.536.22 కోట్లకు గాను.. రూ.12.26 కోట్లు, ఇతర మౌలిక వసతులకు రూ.50.02 కోట్లకు గాను.. రూ.91.65 కోట్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో విద్యాచందన, ఎల్డీఎం రామిరెడ్డి, నాబార్డు డీడీఎం సుజిత్, పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య, బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.