మామిళ్లగూడెం, జూన్ 30: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించే అంశంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్లతో కలిసి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, సంబంధిత ఆర్సీవోలతో హాస్టళ్ల నిర్వహణ, మౌలిక సదుపాయలు, విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, డార్మెటరీ, ఫర్నిచర్, వంటశాల, డైనింగ్ హాల్, భద్రతా ఏర్పాట్ల వంటి తదితర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భవనాల స్థితిగతులను పరిశీలించి మరమ్మతులు అవసరమైన చోట వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయ సంక్షేమాధికారులు ఆకస్మిక తనిఖీ చేసి లోపాలను గుర్తించాలని, వాటిపై వెంటనే నివేదిక సమర్పించాలని, తదనుగుణంగా ఆయా సంక్షేమ అధికారులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాలని సూచించారు.
ప్రతి సంక్షేమ శాఖలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున అధ్వాన స్థితిలో ఉన్న వసతి గృహాన్ని ఎంపిక చేసి, పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేందుకు నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎక్కడా ఫుడ్ పాయిజన్ సమస్య ఉత్పన్నం కావడానికి వీలులేదని హెచ్చరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దగ్గరలోని వసతి గృహాలను మ్యాపింగ్ చేయాలన్నారు. వసతి గృహాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రీవెన్స్లో అడ్మిషన్లు, బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులకు మిగులు సీట్లలో అవకాశం కల్పించాలన్నారు. జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమాధికారి జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్, ఆర్సీవోలు, విద్యుత్ఏవో శ్రీధర్ పాల్గొన్నారు.