మామిళ్లగూడెం, జూన్ 1 : తమ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కామేపల్లి మండలం సాతానిగూడెంకు చెందిన కన్నేటి రంగయ్యకు ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 255, 262లో ఆరెకరాల 20 కుంటల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమిలోకి వెళ్లేందుకు దారి చూపించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఎం.వెన్నెల తనకు తల్లిదండ్రులు లేరని, 10వ తరగతిలో 493 మార్కులతో ఉత్తీర్ణత సాధించానని, తనకు ఎంపీహెచ్డబ్ల్యూ సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా..
ఆర్సీవో బీసీ సంక్షేమ శాఖకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కార్మికులకు అందించే ప్రసూతి ఆర్థిక సహాయం తనకు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. లేబర్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.