చింతకాని, ఫిబ్రవరి 17 : బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా కుదుపునకు గురై పట్టాలు తప్పింది. ఈ ఘటన చింతకాని మండలం నాగులవంచ-బోనకల్లు గ్రామాల మధ్య 505 కిలోమీటర్ రాయి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బొగ్గు లోడుతో గూడ్స్ రైలు ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో నాగులవంచ-బోనకల్లు గ్రామాల మధ్యకు వెళ్లగానే ఒక్కసారిగా కుదుపునకు గురై పట్టాలు తప్పింది.
వెంటనే అప్రమత్తమైన గూడ్స్ రైలు లోకో పైలెట్(డ్రైవర్) సమయస్ఫూర్తిగా వ్యవహరించి రైలును అక్కడికక్కడే నిలిపివేశాడు. విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులకు చేరవేశారు. రైల్వే శాఖకు చెందిన సాంకేతిక, ఎమర్జెన్సీ సిబ్బంది ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైలు వ్యాగన్ పట్టాలు తప్పిన ప్రదేశాన్ని పరిశీలించి జేసీబీ సహాయంతో వ్యాగన్లోని బొగ్గును ఖాళీ చేసి వ్యాగన్ను పక్కకు తొలగించారు. గూడ్స్ రైలు బోగీల లింక్లు కలిపి ముందుకు నడిపించారు. అనంతరం ఖమ్మం-విజయవాడ మార్గంలో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. సుమారు 5 గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్ల ఆలస్యం కారణంగా రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులుపడ్డారు.