కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. నేషనల్ స్థాయిలో జరిగే ఫుట్బాల్ పోటీల మాదిరిగా ప్రకాశం స్టేడియాన్ని సిద్ధం చేసింది. సింగరేణి యాజమాన్యం కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు సింగరేణి యాజమాన్యం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు 18 సార్లు కోలిండియా క్రీడలకు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్తో 19వ సారి ఆతిథ్యమివ్వనున్నది.
కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 29 : కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలు బుధవారం నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ప్రకాశం స్టేడియంలో జరుగనున్నాయి. కోలిండియా స్థాయి పోటీల్లో ఈసీఎల్, బీసీసీఎల్, సీసీఎల్, సీఎంపీడీఐఎల్, ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్, ఎస్ఈసీఎల్, ఎంసీఎల్, ఎస్సీసీఎల్ పరిశ్రమల నుంచి తొమ్మిది జట్లు పాల్గొంటాయి. బుధవారం ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ శ్రీధర్ ముఖ్యఅతిథిగా, డైరెక్టర్ చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా, డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య, సీఎంవోఏఐ బ్రాంచి అధ్యక్షుడు రమేశ్ పాల్గొంటారని టోర్నమెంట్ కన్వీనర్, జీఎం పర్సనల్ బసవయ్య తెలిపారు.
34వ కోలిండియా స్థాయి ఇంటర్ కంపెనీ ఫుట్బాల్ టోర్నమెంట్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. రెండు పూల్లలో 9 టీములు తలపడనున్నాయని కన్వీనర్, జీఎం పర్సనల్ బసవయ్య తెలిపారు. ఈ సందర్భంగా హెడ్డాఫీస్లో టీమ్ మేనేజర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డ్రా షీట్ను టీం మేనేజర్లందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. ముందుగా సింగరేణి జట్టు ఫుట్బాల్ క్రీడాకారులకు జెర్సీలు, షూ, ప్యాడ్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చీప్ సెక్యూరిటీ హనుమంతరావు, సీనియర్ పీవో గట్టు స్వామి, సుశీల్కుమార్, అవినాస్ తదితరులు పాల్గొన్నారు.