అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు ఈ కార్యక్రమాన్ని షురూ చేశారు. తొలిరోజు వైద్య బృందాలు ఒక మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 55 శిబిరాల్లో మొత్తం 6,199 మందికి కంటి పరీక్షలు చేశారు. 1,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్య తీవ్రత ఉన్న మరో 1,482 మందిని గుర్తించారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 48 బృందాలు రంగంలోకి దిగాయి. 6,803 మందికి కంటి పరీక్షలు చేయగా.. 2,404 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు.
ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ వేదిక అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచే కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు వైద్య బృందాలు ఒక మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేశాయి. ఉదయం 9 గంటలకు శిబిరాలు ప్రారంభం కాగా అప్పటికే ప్రజలు భారీగా తరలివచ్చారు. శిబిరాల వద్ద అధికారులు టెంట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు సమకూర్చారు. శిబిరానికి వచ్చిన వారి ఆధార్ నంబర్లు సేకరించి వైద్య బృందం అక్కడికక్కడే రిజిస్ట్రేషన్స్ చేశారు. వెంటనే కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలు అవసరమైన వారికి అక్కడికక్కడే పంపిణీ చేశారు. ఒక్కో శిబిరం ఒక్కో చోట పది రోజుల పాటు కొనసాగనున్నది. దూర ప్రదేశాల్లో శిబిరాలు నిర్వహించే వైద్యనిపుణులు, వైద్యసిబ్బందికి ప్రభుత్వ ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసింది.
మధిర మండలం దెందుకూరు కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత ప్రారంభించారు. కూసుమంచి శిబిరాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ప్రారంభించి తొలుత తానే వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తల్లాడ మండలం పినపాక, సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వేంసూర్లో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటయపాలెంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, మున్సిపల్ చైర్మన్ నూతకాని జైపాల్, తాటిపూడిలో అదనపు కలెక్టర్ స్నేహలతా మొగిలి, నేలకొండపల్లిలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్, రఘునాథపాలెం మండలం వెంకాయపాలెం, కొణిజర్ల మండలం వందనంలో కలెక్టర్ వీపీ గౌతమ్ శిబిరాలను ప్రారంభించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 55 శిబిరాల్లో వైద్యసిబ్బంది మొత్తం 6199 మందికి కంటి పరీక్షలు చేశారు. 1,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్య తీవ్రత ఉన్న మరో 1,482 మందిని గుర్తించారు. వారికి పదిరోజుల్లో ప్రత్యేకంగా సిద్ధంగా చేసిన కళ్లజోళ్లు అందనున్నాయి.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా గురువారం రెండో దశ కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ మున్సిపాలటీలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న 481 పంచాయతీల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శిబిరాలను ప్రారంభించారు. మణుగూరులో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో బానోత్ హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ లో కలెక్టర్ అనుదీప్ శిబిరాలను ప్రారంభించారు. డీఎంహెచ్వో శిరీష వైద్యశిబిరాలను పర్యవేక్షించారు. కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి అవసరైమన వారికి కళ్లద్దాలు అందజేశామన్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి వారికి త్వరలోనే ఆపరేషన్స్ చేయిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 48 బృందాలు గురువారం రంగంలోకి దిగాయి. నాలుగు మున్సిపాలిటీల్లో 12 కేంద్రాలు, గ్రామాల్లో 36 బృందాలు శిబిరాలు నిర్వహించాయి. నేత్రవైద్య నిపుణులు, వైద్యసిబ్బంది తొలిరోజు 6803 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 2,404 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించి వెంటనే అందజేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న మరో 860 మందిని గుర్తించి వారికి పది రోజుల్లో ప్రత్యేకంగా కళ్లద్దాలు అందజేస్తామని చెప్పారు.
ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు, మందు బిళ్లలను అందిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుంటున్నడు. ప్రైవేటు హాస్పిటల్లో కంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తున్నది.
– రావూరి వెంకటయ్య, మాటూరుపేట
కంటి వెలుగు కార్యక్రమంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ ప్రభుత్వం. కంటి వైద్య శిబిరాల ద్వారా నేత్ర పరీక్షలు చేసి కళ్ల అద్దాలు అందజేస్తున్నది. కంటి వెలుగు ద్వారా చూపును ప్రసాదిస్తున్న దేవుడు కేసీఆర్. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సీఎం కేసీఆర్ పైసాఖర్చు లేకుండా పరీక్షలు చేసి కంటి అద్దాలు అందజేస్తున్నారు.
-నూతనపాటి సుజాత, పినపాక
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం చాలా బాగుంది. పేదలకు ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు చేసి కళ్లజోడు ఇవ్వడం అభినందనీయం. భార్యాభర్తలిద్దరం కంటి పరీక్షలు చేయించుకున్నాం. వైద్యులు పరీక్షించి కళ్లజోడు, మందులను ఉచితంగా అందించారు. ప్రభుత్వమే గ్రామంలో శిబిరం పెట్టి చూడటంతో పేదలకు ఎంతో ఉపయోగం.
-షేక్ సత్తార్, షాహీన్, నేలకొండపల్లి
ఏది చదవాలన్నా.. రాయాలన్నా.. ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగు కార్యక్రమంలో కళ్ల పరీక్ష చేయించుకున్నా. వైద్యులు పరీక్ష చేసి కళ్లజోడు అవసరమని చెప్పారు. కంటివెలుగులో ఇచ్చిన కళ్లజోడు పెట్టుకున్న తర్వాత దగ్గరి చూపు బాగా కనిపిస్తున్నది. మాకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు చేసి కళ్లజోడు అందించడం సంతోషంగా ఉన్నది. – కంభం సత్యవతి, నేలకొండపల్లి
ఎప్పటినుంచో కళ్లను చూపించుకుందామని అనుకున్నా. సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకంతో మాలాంటి పేదళ్ల కళ్లలో వెలుగులు నింపిండు. లక్ష్మీపురంలోని కంటి వెలుగు కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నా. వైద్యులు కంటి అద్దాలను అందించారు. ఇప్పుడు చూపు బాగా కనిపిస్తుంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
-బూరం వెంకటలక్ష్మి, లక్ష్మీపురం
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి కంటి పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు కంటి వెలుగు వరంలాంటిది. నాకు కంటి సమస్య ఉండటంతో ఎప్పటినుంచో పరీక్ష చేయించుకోవాలనుకున్నా. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అలాగే ఉండిపోయి. కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం దక్కింది. వైద్యులు పరీక్షించిన తర్వాత కంటి అద్దాలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. – ఆలేటి వెంకటేష్, లక్ష్మీపురం
గ్రామానికే వైద్యులను రప్పించి వైద్యం అందించడం చాలా సౌకర్యంగా ఉంది. చాలారోజులుగా కంటి దవాఖానకు వెళ్దామనుకున్నా. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్ష చేయించుకున్నా. పైసా ఖర్చు లేకుండా వైద్యులు కళ్లజోళ్లు అందించారు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాను.
-గోళ్ల తిరుపతమ్మ, వందనం గ్రామం, చింతకాని మండలం
కంటి సమస్యలను నయం చేసుకోవడానికి పేదోళ్లు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్లినా వందల రూపాయలు వెచ్చించి కళ్లద్దాలు కొనే స్తోమత ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి వాళ్ల బాధలు తీరాయి. నేను కంటి వెలుగు శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నాను. వైద్యసిబ్బంది నిమిషాల వ్యవధిలో నాకు కళ్లజోడు ఇచ్చారు.