చింతకాని, మే 19: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి రూ.7.33 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా.. బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం చింతకానిలో లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఈ ఏడాది ఇప్పటివరకు 2వేలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామని అన్నారు. పేదల ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటోందని అన్నారు.
‘కల్యాణలక్ష్మి’ బృహత్తర పథకం
సీఎం కేసీఆర్ ఆమలు చేస్తున్న బృహత్తర పథకం కల్యాణలక్ష్మి అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మండలంలోని 41 మందికి మంజూరైన రూ.41.04 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను చింతకాని రైతువేదికలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. పేద కుటుంబాలకు ఈ పథకాలు వరంలాంటివని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మంగీలాల్, కోపూరి పూర్ణయ్య, గురజాల హనుమంతరావు, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, గడ్డం శ్రీను, బొడ్డు వెంకట్రామారావు, నూతలపాటి వెంకటేశ్వర్లు, బొగ్గారపు రాంబాబు, కన్నెబోయిన కుటుంబరావు, చాట్ల సురేశ్, కాళంగి లలిత, తిరుపతి కొండలు, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, పిన్నెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.