కల్లూరు, మే 21: వీఆర్ఏలు అరకొర జీతాలతో పనిచేస్తున్నారని, వారి కొలువులను క్రమబద్ధీకరించి సీఎం కేసీఆర్ వారి జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం వీఆర్ఏ సంఘం రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి తనను అభినందించారన్నారు. వీఆర్ఏల సమస్యలను ఆలకించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏల కొలువులను క్రమబద్ధీకరించారన్నారు. జూన్ 21లోగా వీఆర్ఏలకు వివిధ శాఖల్లో పోస్టింగ్స్ వస్తాయన్నారు. గ్రామాల్లో రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగాలంటే వీఆర్ఏల వ్యవస్థ కీలకమన్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించారన్నారు. వీఆర్ఏల్లో 80శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనన్నారు. నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలుత వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపారన్నారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకులు రమేశ్ బహదూర్, ఎస్కే దాదేమియా మాట్లాడుతూ.. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల కుటుంబాల్లో వెలుగులు తీసుకువస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తాము రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్కే రఫీ, మాధవనాయుడు, వంగూరి రాములు, ఉమామహేశ్వర్, అజీజ్, బెజ్జం భరత్కుమార్, జానీమియా, జానీ, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
‘కల్యాణలక్ష్మి’ చెక్కుల పంపిణీ
వేంసూరు, మే 21: మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 44 మంది లబ్ధిదారులకు రూ.44,05,104 విలువైన చెక్కులు, రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పచ్చిరొట్ట విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూసారాన్ని పెంపొందించుకొనేందుకు పచ్చిరొట్ట ఉపయోగపడుతుందన్నారు. సొంత జాగా ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. వేంసూరు మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వీఆర్ఏలకు జూన్ 21 లోగా ప్రభుత్వం వివిధ శాఖల్లో పోస్టింగ్స్ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్రెడ్డి, టెలికాం అడ్వయిజరీ జిల్లా కమిటీ సభ్యుడు మిరియాల ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.