భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ సింగరేణిని అప్పులు పాలు చేసిందని విమర్శించారు. ఆనాడు సింగరేణిలో లాభాలు కేవలం రూ.60 కోట్లు ఉండేవని, తెలంగాణ వచ్చాక ఆ లాభాలను రూ.700 కోట్లకు తీసుకొచ్చామని అన్నారు. కొత్త నియమకాలు చేపట్టడంతోపాటు వారసత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చామన్నారు. గతంలో వాటిని పోగొట్టిన నీచ చరిత్ర కాంగ్రెస్తో పాటు వామపక్షాలకే దక్కుతుందని ధ్వజమెత్తారు. గని ప్రమాదంలో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే గతంలో కేవలం రూ.లక్ష మాత్రమే పరిహారం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామని వివరించారు.
‘పావన గోదావరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గోదావరిని దృష్టిలో ఉంచుకునే జిల్లాకు భద్రాద్రి జిల్లా అని నామకరణం చేశాం. ఎలక్షన్లు వస్తాయి.. పోతాయి.. కానీ ప్రజల్లో పరిణితి రావాలి. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు పరిణితి చెందాయి. అలాగే మన దేశమూ పరిణితి చెందాలి. అప్పుడే మంచి నాయకులు ప్రజాప్రతినిధులవుతారు. ప్రజల చేతిలో ఓటు అనే వజ్రాయుధం ఉంది. అలాంటి ఓటు వేస్తే ప్రజలే గెలవాలి.. వనమా వెంకటేశ్వరరావుకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది.. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా చీకటి అలుముకునేదని, రాష్ట్రం వచ్చిన తర్వాతే చీకట్లు తొలగిపోయాయని సీఎం అన్నారు. పంటలకు సాగునీరు అందక, కరెంట్ కోతలతో వేగలేక రైతులు నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారి కష్టాలు తీరిస్తూ ఇప్పుడు పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎప్పుడు స్విచ్ చేసినా పొలానికి సాగునీరు పారే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేయిస్తామన్నారు.
నాడు ప్రజలకు సుస్తీ చేసి సర్కారు దవాఖాన వరకు వెళ్లి అక్కడి దుస్థితిని చూసి తిరిగి వెనక్కి వచ్చేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడంతో ప్రతిఒక్కరూ సర్కారు దవాఖానలకే వెళ్తున్నారని సీఎం వివరించారు. తమ ప్రభుత్వం కొత్తగూడేనికి ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇచ్చిందని, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని గుర్తుచేశారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలోనే 16,765 ఎకరాల భూమికి పట్టాలు అందించామని వివరించారు. ఎస్సీల కోసం దళితబంధు పథకాన్ని తెచ్చామన్నారు.
బీఆర్ఎస్ నడక ఏమిటో ప్రజలు గమనించాలని సీఎం అన్నారు. మంచీచెడు ఆలోచించి ఓటు వేయాలని, కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలుపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు పెట్టే అవకాశం లేకుండా వారి సమస్యలను పరిష్కరించామని అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని గమనించి తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు.
ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాదిగా ప్రజలు తరలొచ్చారు. సభా ప్రాంగణాలు జన సునామీలను తలపించాయి. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు ముందుగానే సభా స్థలాలకు చేరుకున్నారు. కేసీఆర్ వేదికపైకి వచ్చే వరకు వారంతా ఓపికగా ఎదురుచూశారు. రెండుచోట్లా వీధులన్నీ గులాబీమయ్యాయి. కేసీఆర్ ప్రత్యర్థులను ఉద్దేశించి వదిలిన వాగ్బాణాలకు సభల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కేసీఆర్కు జై కొట్టారు. కొత్తగూడెం సభలో తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్తగూడెం ప్రజలు నిర్వహించిన పాత్రను కొనియాడగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక పోతే కొత్తగూడెం జిల్లా అయ్యేదా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? ప్రతి ఇంటికి సంక్షోమం వచ్చేదా? ’అంటూ చేసిన ప్రసంగానికి సభ చప్పట్లతో మోగిపోయింది. కొత్తగూడెంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాను, ఖమ్మంలో పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ను గెలిపించి రాజకీయ చైతన్యాన్ని చాటాలని పిలుపునివ్వగా పార్టీ శ్రేణులు జై కొడుతూ ప్రతిస్పందించాయి. కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై వారి పేర్లు ప్రస్తావించకుండానే పరోక్షంగా సీఎం మాటల దాడి చేశారు. సీఎం వ్యాఖ్యలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.