ఏ పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు. ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలన్నీ పండుగలన్నింటినీ చిన్నచూపు చూసినవే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్.. ఆలయాలు, చర్చిలు, మసీదుల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు, రంజాన్ మాసంలో ముస్లింలకు తోఫా, క్రిస్మస్కు పేద క్రిస్టియన్లకు దుస్తులు, ఫాదర్లకు పారితోషికాలు అందిస్తూ అక్కున చేర్చుకున్నారు. అభివృద్ధికి నోచుకోని ఆలయాలను, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అర్చకుల కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్.. సర్వశ్రేయోనిధి ద్వారా ఆలయాల పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేశారు. ధూప దీప నివేదన పథకం కింద అర్చకులకు పెంచిన వేతనాలను నెలనెలా అందిస్తుండడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
– ఖమ్మం కల్చరల్/కొత్తగూడెం టౌన్
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం టౌన్, జూన్ 20 : సంక్షేమ పథకాలతోపాటు ఆధ్యాత్మికంగా అన్ని పండుగలకు సమాన ప్రాధ్యాన్యతనిస్తున్న తెలంగాణ సర్కార్ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలంగాణలో జరుపుకునే ప్రతి పండుగలో సర్కారు సాయం అందించడంలో ముందువరసలో ఉంది. దసరాకు బతుకమ్మ చీరెలు, రంజాన్కి రంజాన్ తోఫా, మసీదులకు మరమ్మతులు, క్రిస్మస్ పండుగకు దుస్తులు, చర్చిల్లో భోజన ఏర్పాట్లు చేసి మతపెద్దలకు పారితోషకం ఇచ్చి అక్కున చేర్చుకుంటున్నది. అన్నిమతాల వారిని బిడ్డలు లాగా చూసి తెలంగాణ సమాజంలో పండుగలకు పెద్దపీట వేసింది. నేడు తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ సంబురాలను జిల్లావ్యాప్తంగా అధికారులు ఘనంగా నిర్వహించబోతున్నారు.
ధూపదీప నైవేద్యాలకు 81 ఆలయాలు ఎంపిక
ధూపదీప నివేదన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 81 ఆలయాలను ఎంపిక చేసింది. దీనిద్వారా అర్చకులకు ఏడాదికి రూ.58 లక్షల 32వేలను ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నది. దీంతో పాటుగా సర్వశ్రేయోనిధి ద్వారా జిల్లాలోని ఆరు ఆలయాలకు పునర్నిర్మాణానికి రూ.5.10 కోట్లను మంజూరు చేసింది. బలహీనవర్గాల హౌసింగ్ కాలనీ పథకం ద్వారా మూడు దేవాలయాలకు రూ.36 లక్షలను మంజూరు చేసింది. దాతల విరాళాలతో నాలుగు దేవాలయాల్లో రూ.1.87 లక్షలను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న 168 అర్చక ఉద్యోగులకు జిల్లాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.10,21,73,052 చెల్లిస్తున్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు అర్చక భృతి నెలకు రూ.2500 మాత్రమే ఉండేది. అది కూడా కేవలం 18 దేవాలయాలకే వర్తించగా రూ.5.40 లక్షలను మాత్రమే చెల్లించేవారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా ప్రముఖ ఆలయాల్లో హోమాలు..విశేష పూజలు..
జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకుని శైవ, వైష్ణవ ఆలయాల్లో పూజలు, అర్చనలతో పాటు జిల్లాలో ఎంపిక చేసిన ప్రముఖ ఆలయాల్లో హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ఖమ్మంలోని ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (గుట్ట)లో సుదర్శన హోమం, కూసుమంచి గణపేశ్వరాలయంలో రుద్రాభిషేకం, వైరా శ్రీకోదండ రామస్వామి దేవాలయం, జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాల్లో సుదర్శన యాగం, సత్తుపల్లి నీలాదీశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి వాసవి గార్డెన్స్ వరకు మేళతాళాలు, వేద మంత్రాలతో అర్చకులు, వేద పండితులు, భక్త బృందాలు శోభాయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం వాసవి గార్డెన్స్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఈ కల్యాణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు పాల్గొని పూజలు చేయనున్నారు.
ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కేవలం నామమాత్రపు ఆలయాలకు మాత్రమే గతంలో ధూపదీప నైవేద్యాలతోపాటు అర్చకులకు వేతనాలు ఇచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో 81ఆలయాలను ఎంపిక చేయడం, అర్చకులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచి అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దేవాదాయశాఖ ఉద్యోగులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవతోనే జరుగుతోంది.
– సులోచన, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
నేడు ప్రత్యేక కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలకు మంచి గుర్తింపును ఇచ్చి మరింత అభివృద్ధికి పాటుపడుతోంది. ఇందులో భాగంగా దశాబ్ది వేడుకల సందర్భంగా స్థానిక గణేష్ టెంపుల్ ఆలయంలో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నాం. దేవాదాయశాఖ సూచనలు పాటిస్తూ రోజుకొక కార్యక్రమాన్ని ఆలయంలో అర్చకులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో జిల్లాలోని ఆలయాలకు మంచి ఆదరణ లభించింది.
– ఈవో సులోచన, గణేష్ టెంపుల్
తెలంగాణలో గౌరవం దక్కింది
తెలంగాణ వచ్చాక అన్ని మతాలతో సమానంగా అన్ని పండుగలకు సమాన గుర్తింపునిచ్చారు. ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించడంతోపాటు పండుగ జరుపుకునేందుకు సాయం కూడా అందజేశారు. మతపెద్దలకు గౌరవించే సంస్కారం తెలంగాణ వచ్చాక సాధ్యమైంది. క్రిస్మస్ ప్రతి ఏటా పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం.
– మద్దెల శివకుమార్, క్రిస్టియన్ సొసైటీ ఫోరం అధ్యక్షుడు