ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ ఆదేశానుసారం గురువారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించారు. వీటిని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రారంభించి ప్రసంగించారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. చెస్ మేథస్సుకు పదును పెడుతుందన్నారు.
ఈ ఆటలో రాణించిన వారు మానసిక దృఢత్వాన్ని పొందుతారని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు అద్భుతంగా రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం కావాలని ఆకాంక్షించారు. మొదటి, రెండు స్థానాల్లో రాణించిన వారిని శుక్రవారం హైదరాబాద్లో జరిగే పోటీలకు పంపిస్తామన్నారు. ఖమ్మం కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెస్ పార్కును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్జీఎఫ్ కార్యదర్శి కే.నర్సింహారెడ్డి, వనిజరెడ్డి జ్ఞాపకార్థం 60 టీ షర్టులను ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులకు మేయర్, కలెక్టర్ చేతుల మీదుగా ఉచితంగా అందించారు. చెస్ పోటీల్లో మొదటి విన్నర్గా చరిష్మా (ఖమ్మం రూరల్), రన్నర్గా దివ్య (మధిర), తృతీయ స్థానంలో సేతు శ్రీవల్లి (ఖమ్మం), నాలుగో స్థానంలో కీర్తన (ఖమ్మం) నిలువగా విజేతలకు కలెక్టర్, మేయర్ బహుమతులు అందజేశారు. డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, డీఈవో సోమశేఖరశర్మ, డీవైఎస్వో పరంధామరెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, చెస్ కోచ్ గోపీకృష్ణ, పీడీ రఘునందన్రావు, వివిధ క్రీడల కోచ్లు ఎండీ అక్బర్ అలీ, సైదులు, కైలాశ్, సురేశ్, పవన్, సాంబమూర్తి, ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు.