ఖమ్మం/కొత్తగూడెం టౌన్, మార్చి 28 : కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు భూమిపై మనిషిగా పుట్టి మనుషులందరి పాప విముక్తి కోసం సిలువపై మరణించిన రోజే గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం). దేవుడు చేసిన సృష్టి అంతటిలో మనిషికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మనిషిని దేవుడు తన పోలికలో సృష్టించాడని బైబిల్ చెబుతోంది. అయితే మనిషి పాపం చేసి దేవుడికి దూరంకావడంతో తొలుత మరణానికి తర్వాత నరకానికి వెళ్తున్నాడు. మనిషిని ఎంతగానో ప్రేమించిన దేవుడు అలా నరకానికి వెళ్లనీయకుండా అందరి పాపాలకు మారుగా తానే బలికావాలని నిర్ణయించుకున్నాడు.
ఆ ఘోర నరక శిక్షను తప్పించి మనిషిని తనతోపాటు యుగయుగాలు పరలోకరాజ్యంలో జీవింపజేసేందుకు దేవుడే భూమిపై మనిషిగా జన్మించాడు. ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన యేసు (రక్షకుడు) సర్వ మానవాళికి పాప విముక్తి కలుగజేసేందుకు సిలువపై మృతిచెందాడు. ఏ పాపం ఎరుగని యేసు కన్య గర్భాన జన్మించి మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి యుక్త వయస్సులో మరణించాడు. తన శరీరంలోని రక్తమంతా కార్చాడు.
అందరి పాపాల కోసం పరలోకం నుంచి భువికి దిగొచ్చిన దేవుడు(యేసు) 2024 సంవత్సరాల క్రితం శుక్రవారం రోజు కలువరి కొండపై మండుటెండలో సిలువపై ఘోరంగా శిక్షను అనుభవించి మృతిచెందాడు. మూడోదినాన ఆదివారం మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అలా చనిపోయి తిరిగిలేచిన యేసు కొద్దిరోజులు అనేకమందికి కనిపించి పరలోకంలోని పరమతండ్రి వద్దకు ఆరోహణమయ్యాడు. మళ్లీ రెండోసారి వచ్చి తనను నమ్మిన వారిని పరలోకం తీసుకెళ్తానని వాగ్ధానం చేశాడు.
అంటే.. మనుషుల పాపాలకు వారు పొందాల్సిన శిక్షను యేసుక్రీస్తు సిలువపై భరించాడు. ఇంత గొప్ప యేసుక్రీస్తు త్యాగాన్ని గుడ్ఫ్రైడే రోజు స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్చిలను సుందరంగా అలంకరించారు. సిలువపై మృతిచెందే ముందు యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను పాస్టర్లు వివరించి బోధించనున్నారు. ఏసుక్రీస్తు చనిపోయిన సమయం మధ్యాహ్నం మూడు గంటలకు క్రైస్తవులందరూ ఒకేసారి మోకరించి ప్రార్థనలు చేస్తారు.
క్రీస్తు మరణ ఇతివృత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సోదరులు శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రార్థనలు చేస్తారు. 41 రోజుల ఉపవాస దీక్షల సారాంశం కూడా ఇదే. ఇలా అన్ని ప్రార్థనా మందిరాల్లో అందరూ కలిసి ప్రత్యేక కన్నీటి ప్రార్థనలు, కీర్తనలు ఆలపిస్తారు. శుభ శుక్రవారం నాడు విశ్వాసులంతా కలిసి తమ కాలనీల్లో రోడ్లపై ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేక కీర్తనలు ఆలపిస్తూ క్రీస్తు త్యాగాన్ని మననం చేసుకుంటారు. క్రీస్తు సిలువ మరణం పొందిన ఇతివృత్తాన్ని తెలియజేసేలా ప్రత్యేక వేషధారణలతో విశ్వాసులు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు.
క్రీస్తు కల్వరి కొండపై శిలువ మరణం పొందిన తరువాత అతని దేహాన్ని ఒక గుహలో దాచిపెడతారు. మూడో రోజు శిష్యులు వచ్చి చూడగా అక్కడ క్రీస్తు దేహం ఉండదు. ‘నేను ఉన్న వాడను, అనువాడను.. జీవించువాడను, మూడో రోజు మరలా లేస్తానని’ క్రీస్తు చెప్పిన విషయాన్ని శిష్యులు గుర్తు చేసుకుంటారు. అప్పుడు క్రీస్తు పునరుత్థానుడయ్యాడని శిష్యుల నమ్మకం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు క్రైస్తవులు ఈ ఉపవాస దీక్షలు ముగించుకొని ఆదివారం ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రీస్తు మరలా లేచాడనే గొప్ప సువార్తను ప్రకటిస్తారు. సంతోష గానాలతో కీర్తనలు పాడి స్తుతులు చెల్లిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.
1. తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.
2. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.
3. అమ్మా ఇదిగో నీ కుమారుడు.. ఇదిగో నీ తల్లి..
4. నా దేవా.. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి.
5. నేను దప్పికగొనుచున్నాను.
6. సమాప్తమైనది.
7. తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.