ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలు ఖరారయ్యాయి. ఈనెల 12వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం, 18వ తేదీన ఖమ్మంలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల ప్రారంభించనున్నారు. ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉభయ జిల్లాల అధికారులు, అనుదీప్ పర్యవేక్షణలో అధికారులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభలు జరిగే అవకాశం ఉండడంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రెండు జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్ జనసమీకరణపై దృష్టి సారించారు.
ఖమ్మం, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 12, 18 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. 12న భద్రాద్రి కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన రెండు జిల్లాలో ఉంటుందన్న సమాచారంతో జిల్లా అధికారులు ఏర్పాట్లకు సమామయత్తమవుతున్నారు. రెండు చోట్ల భారీ బహిరంగ సభులు ఉండే అవకాశం ఉండడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రిపువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సహా ఇతర ముఖ్యులు.. సీఎం పర్యటన ఏర్పాట్లు, జనసమీకరణపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులతో చర్చించారు. 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో నూతన సమీకృత పాలనా భవనాన్ని ప్రాంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుని నూతన కలెక్టరేట్ను ప్రారంభించానున్నారు. అలాగే 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో రూపొందించిన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఖమ్మానికి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. వీటితోపాటు జిల్లా కేంద్రంలో సిద్ధంగా ఉన్న పలు అభివృద్ధి పనులను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లపై రెండు జిల్లాల అధికారులతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ సమీక్షిస్తున్నారు.