రామాలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ముక్కోటి దేవతలకు వీడ్కోలు
రామయ్య సేవలో అహోబిల రామానుజ చినజీయర్ స్వామి
భద్రాచలం, ఏప్రిల్ 16: భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 2న ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున స్వామివారికి పవిత్ర గోదావరిలో వైభవోపేతంగా చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో పూర్ణాహుతి, హోమం జరిపించి గరుడ ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. సీతారాముల కల్యాణానికి ఆహ్వానించిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికారు. శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవాలకు శనివారం పూర్ణాహుతితో ముగింపు పలికారు. చివరి రోజున స్వామివారికి చక్రతీర్థం నిర్వహించడం ఆనవాయితీ. కాగా, బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి నిత్యకల్యాణాలను, ఇతర ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
రామయ్య సేవలో..
భద్రాద్రి రామయ్యను అహోబిల రామానుజ చిన జీయర్ స్వామి శనివారం దర్శించుకున్నారు. కొన్నేళ్లుగా శ్రీరామనవమి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఉదయం నిర్వహించిన చక్రతీర్థంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించారు.