పర్ణశాల, ఫిబ్రవరి 12 : దుమ్ముగూడెం మండల సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్లోని సీజీ మారాయిగూడెం గ్రామం కోడిపందేలకు చిరునామాగా ఉంది. సంక్రాంతి ముగిసినప్పటి నుంచి వేసవి వరకూ ఇక్కడ జోరుగా కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సీజీ మారాయిగూడెం వెళ్లేందుకు దుమ్ముగూడెమే ప్రధాన మార్గం కావడంతో ఈ ప్రాంతం జూదరులు, పరిసర ప్రాంతాల జూదరులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. తెలంగాణలో కోడిపందేలపై నిషేధం ఉండడంతో భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాలకు చెందిన కొందరు జూదరులు సీజీ మారాయిగూడెంలో ఏటా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి సీజన్లో ఆంధ్రాలో ముగిసిన తరువాత ఇక్కడ మొదలవుతాయి. ఇక్కడి పందేలకు స్థానికులతోపాటు ఏపీ, తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి కూడా జూదరులు వచ్చి రూ.లక్షల్లో పందేలు కాస్తుంటారు. అయితే ఏపీ మాదిరిగా ఛత్తీస్గఢ్లో కూడా కోడిపందేలపై నిషేధం లేకపోవడం నిర్వాహకులకు అనుకూలంగా మారింది. ఆ ప్రాంతంలో కొందరు జూదరులు జాతి కోళ్లను కూడా విక్రయిస్తూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.
ఇక ఈ కోడిపందేల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసులు నిరుడు కఠిన చర్యలు తీసుకోవడంతో పందేలకు కొంత బ్రేక్ పడింది. కానీ.. ఈ ఏడాది భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడి కోడిపందేల్లో గతంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. అయితే అవి బయటకు రాకుండా నిర్వాహకులు జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. ఇదే కోడిపందేల్లో దొంగ నోట్ల మార్పిడి కూడా జరిగినట్లు ఆరోపణలున్నాయి.
జాతరలా జరిగే ఈ కోడిపందేల స్థావరాల వద్ద నిర్వాహకులు టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. మద్యం ఏరులై పారుతుంది. మరికొందరు జూదరులు పేకాట కూడా ఆడుతుంటారు. అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరు గిరిజనులు కూడా ఈ పందేల్లో పాల్గొంటారు. ఏడాదంతా చెమటోడ్చి సంపాదించిన మొత్తాన్ని ఈ పందేల్లో పోగొట్టుకుంటున్నారు. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో దుమ్ముగూడెం మండలంలో గొత్తికోయ గ్రామాలైన వంకమడుగు, మానుగట్టు, పైడిగూడెం అటవీ ప్రాంతాల్లో కూడా మండలానికి చెందిన కొందరు కోడిపందేలు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.