భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ఎంత ఆహారం తీసుకున్నా మన్యం ప్రాంతంలో రక్తహీనత సమస్య గిరిజనులను వెంటాడుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యంతో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు ప్రాజెక్టుల్లో అమలు చేయగా ఈసారి 7 ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నది. ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి భోజనం పెడుతున్నప్పటికీ అదనంగా మిల్లెట్ ఫుడ్ అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు ప్రాజెక్టుల పరిధిలో పిల్లలు 14,941 మంది, గర్భిణులు, బాలింతలు 8,828 మంది ఈ మిల్లెట్ ఆహారం తీసుకుంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు, తల్లులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దాని నివారణకు పూనుకుంది. ఇందులో భాగంగా మిల్లెట్ ఆహారాన్ని అందజేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లో రక్తహీనత సమస్య ఉన్న పాంతాలను గుర్తించింది. అందులో ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నాయి.
రక్తహీనతకు చెక్ :
తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్దక ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారం కేవలం మిల్లెట్లోనే ఉంటుందని సర్వేల ద్వారా తెలుసుకున్న యంత్రాంగం గిరిజన ప్రాంతంలో పోషకాలు అందని వారిని గుర్తించారు. కేవలం బియ్యం ద్వారా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లీబిడ్డకు సరైన ఆహారం అందడం లేదని నేషనల్ హెల్త్ మిషన్ సర్వే ద్వారా నివేదికను అందజేసింది. దీంతో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి భోజనంతోపాటు మిల్లెట్ ద్వారా తయారుచేసే ఆహారం ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్తహీనత శాతం 68.70గా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోషకాహారం అందించడం చాలా కీలకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల్లో బాల్యం నుంచే సరైన పోషకాహారం లేకపోవడంతో రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ప్రసవం సైతం వీరికి ప్రాణాంతకంగానే మారుతున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించేందుకు చర్యలు తీసుకున్నది. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మిల్లెట్ ఆహారం ఇస్తుండడంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ముందస్తుగా వారి రక్త నమూనాలను కూడా సేకరించి ప్రస్తుత రక్తహీనత సమస్యను గుర్తించారు.
వారానికి రెండ్రోజులు మిల్లెట్ ఫుడ్ :
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలు, తల్లులు, గర్భిణులకు ప్రత్యేకంగా అదనపు ఆహారంగా వారానికి రెండ్రోజులు ఇస్తున్నారు. ప్రతి బుధ, శనివారంలో ఇస్తున్నారు. పెసర, మిల్లెట్, మిరియాలు, మిర్చి, ఉప్పుతో కలిపిన మిశ్రమాన్ని ఉప్మాలా తయారు చేసి కేంద్రాల్లోనే అందజేస్తున్నారు. బూర్గంపాడు, దుమ్మగూడెం, మణుగూరు, టేకులపల్లి, అశ్వారావుపేట, పాల్వంచ, దమ్మపేట ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,059 కేంద్రాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది.
ఎవరికి ఎంత ఆహారం :
పిల్లలు బరువుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఏజెన్సీ ప్రాంతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలు ఎక్కడ ఎప్పుడు ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. పిల్లలకు 50గ్రాములు, తల్లులకు 100గ్రాములు ఇస్తున్నారు. దీంతోపాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పెరటితోటల పెంపకం ఏర్పాటు చేసి భోజనంలో పెట్టే కూరల్లో పెరటి ఆకుకూరలు, కూరగాయల ద్వారా కూరలను తయారు చేస్తున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రిగార్డెన్ కూడా రెడీ చేసుకున్నారు. జిల్లాలో 1,120 ఎకరాల్లో మిల్లెట్ సాగు చేస్తున్నారు. 54 క్వింటాళ్ల విత్తనాలను కూడా అందజేశారు.
రక్తహీనత సమస్య లేకుండా..
గిరిజన ప్రాంతంలో ఎన్నోరకాల సమస్యలు ఉంటాయి. కేవలం బియ్యంతో వండిన భోజనం తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఉండదని ఆరోగ్యశాఖ సర్వేలు చెబుతున్నాయి. అందుకే మిల్లెట్ ద్వారా తయారుచేసిన ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కేవలం వంద సెంటర్లకే పరిమితం చేసిన ఈ ఆహారాన్ని జిల్లాలో 7 ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నాం. 1,058 కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలు, తల్లులు, గర్భిణులకు అందిస్తున్నాం. ఈ ఆహారం తీసుకున్న వారు ఆరోగ్యంగా ఉన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా గర్భిణిలకు చాలా ఉపయోగపడుతున్నది.
– స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో, భద్రాద్రి కొత్తగూడెం