భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : గోదావరి నదిపై భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు విమర్శించారు. నేషనల్ హైవేస్ అధికారులతో ఎంకెన్నాళ్లకు పూర్తి చేయిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం భద్రాద్రి కొత్తగూడెం ఐడీవోసీలో డీఆర్డీవో మధుసూదనరాజు అధ్యక్షతన గురువారం జరిగింది. కలెక్టర్ ప్రియాంక పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ నామా మాట్లాడుతూ.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టర్లతో చర్చించి ఆ రెండో బ్రిడ్జీ నిర్మాణ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అలాగే, రైల్వే అధికారుల తీరుగా సక్రమంగా లేదని మండిపడ్డారు. గత సమావేశానికి కూడా సరైన సమాచారం లేకుండా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో రైల్వేస్టేషన్ ఉన్నా సరిపడినన్ని రైళ్లు నడపకపోవడం దారుణమన్నారు. గతంలో రద్దు చేసిన రైళ్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. పాండురంగాపురం నుంచి భద్రాలం వరకు కేవలం 17 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ నిర్మించలేకపోతున్నారని విమర్శించారు. రైల్వే విభాగం అధికారులు వచ్చే సమావేశాలకైనా స్పష్టమైన సమాధానాలతో హాజరుకావాలని సూచించారు. తన కోటాలో అంబులెన్సులను మంజూరు చేస్తే వాటిపై తన ఫొటోను ఎందుకు తొలగించారంటూ వైద్యశాఖ అధి కారులపై ఎంపీ నామా మండిపడ్డారు. అలాగే బీఎస్ఎన్ఎల్ అధికారులు మారుమూల గ్రామాల్లో సెల్టవర్లు నిర్మించడం లేదని విమర్శించారు.
అధికారులపై
సమగ్ర నివేదికలు, సరైన సమాధానాలు లేకుండా దిశ సమావేశానికి వచ్చిన అధికారులపై కలెక్టర్ ప్రియాంక సీరియస్ అయ్యారు. దిశ మీటింగ్ అనేది సాధారణ సమావేశం కాదని, ఎంతో ముఖ్యమైన ఈ సమావేశాన్ని సాదాసీదాగా తీసుకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశ ప్రశ్నలకు సరైన సమాధానం కూడా పంపకుండా ఈ సమావేశానికి మళ్లీ ఎలా వచ్చారని ప్రశ్నించారు. రైల్వే అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. వచ్చే సమావేశాల నాటికి ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే ఇక్కడి ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలు అందాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కేవలం గత సీఎం కేసీఆర్ కృషి వల్లనే వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ వైద్యం చేరువైందని స్పష్టం చేశారు. అలాగే, మూత్రపిండాల సమస్యలకు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టుల కొరత ఉన్నందున వెంటనే అక్కడ ప్రసూతి వైద్యులను నియమించాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. అక్కడి గైనకాలజిస్టులు లేకపోవడం వల్ల గర్భిణులు కొత్తగూడెం రావాల్సి వస్తోందని అన్నారు. అలాగే తాలిపేరు ప్రాజెక్టుకు మూడు గేట్లు వేయాలని, అక్కడి రైతులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మూడు గేట్లు నిర్మిస్తే అక్కడి పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని అన్నారు. అలాగే రెగ్యులర్ టీచర్లను నియమించి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికీ ఒకటి చొప్పున సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని, రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు.
గ్రామాల్లో కోతుల బెడదను నివారించాలని వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు కోరారు. కోతుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పంచాయతీరాజ్ శాఖ అధికారులు చొరవ తీసుకొని వాటిని అదుపు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని డయాలసిస్ సెంటర్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. త్రీటౌన్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు డబుల్ రోడ్ నిర్మాణం నిలిచి పోయినందున దానిని పూర్తి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య పనులు చేయడం లేదని, నేషనల్ హైవే వద్ద డ్రైనేజీ నిర్మాణాలు నిలిచిపోయాయని అన్నారు. దిశ కమిటీ సభ్యులు కే.వెంకటేశ్వర్లు, పరంజ్యోతిరావు, ఆళ్లపల్లి, చర్ల, దుమ్ముగూడెం, గుండాల ఎంపీపీలు తమ మండలాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.