ఖమ్మం, ఏప్రిల్ 19: ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అలాగే, పాత వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తనను కలిసిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్నేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనుల పురోగతి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం రాకముందే మున్నేరు నదిపై వంతెన పనులు పూర్తి చేయాలని సూచించారు. నీటి నిల్వ కోసం ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు.
చెక్డ్యాం నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతామని అన్నారు. మున్నేరుపై వంతెన, చెక్డ్యాం నిర్మించడం వల్ల పర్యావరణం వృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే, మున్నేరుపై పాత బ్రిడ్జిని సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అయితే, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, పాత వంతెన సుందరీకరణ తదితర అంశాలపై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. వారి సూచనలు ప్రకారం ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ని నియంత్రించి పనులు చేయాలని సూచించారు. మున్నేరుకు ఇరువైపులా కొత్తగా నిర్మించునున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ సంస్థను సమన్వయ పర్చుకొని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.