వైరారూరల్, ఏప్రిల్ 12 : గత కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విడతల వారీగా అమలు చేస్తూ తీరొక్క మొక్కలు నాటింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, పొలం గట్లపై నాటిన మొక్కలకు పంచాయతీ సిబ్బంది నిరంతరం నీరందించడంతో ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. పచ్చదనాన్ని సంతరించుకొని నీడనిస్తూ బాటసారులకు కనువిందు చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుత వేసవిలో వాటి ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో నీరందక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
వైరా మండలం ఖానాపురం-గన్నవరం గ్రామాల మధ్య రోడ్ల పక్కనున్న పొలాల్లోని చెత్తకు ఓ రైతు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి హరితహారంలో భాగంగా నాటిన చెట్లు కాలిపోయాయి. ఎదిగిన చెట్లన్నీ వరుసగా కాలిపోయి మోడుగా మారాయి. ప్రస్తుత వేసవి కాలంలో అసలే నీరందక చెట్లు ఎండిపోతుంటే దీనికి తోడు మంటలు అంటుకోవడంతో పచ్చదనమంతా కనుమరుగైంది. మొన్నటి వరకు వేసవి తాపానికి ఆ చెట్ల కిందే సేద తీరిన బాటసారులు, వాహనదారులు కాలిపోయిన చెట్లను చూసి అయ్యో.. అంటూ చలించిపోతున్నారు. సంబంధిత శాఖల అధకారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతున్నదని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, చెట్లను కాపాడే బాధ్యతను పంచాయతీ అధికారులు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.