చింతకాని, ఫిబ్రవరి 23: బతుకుదెరువు కోసం జిల్లాంతరాలు దాటాడు. బాతులు మేపుకుంటూ వలసొచ్చాడు. బాతు గుడ్లు విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చివరికి హత్యకు గురై విగతజీవిగా మారాడు. బాతుల కాపరి హత్యకు గురైన ఘటన చిన్నమండవ కొత్త బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రంపూర్కు చెందిన పేరం వెంకటేశ్వర్లు (46) బాతులు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. భార్య మరియమ్మతో కలిసి బాతులను మేపుతూ కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చాడు. పలు ప్రాంతాల్లో బాతులు మేపుతూ వారం క్రితం చిన్నమండవకు వచ్చారు.
సీతంపేట- చిన్నమండవ గ్రామాల మధ్య చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని బాతులు మేపుతూ వాటి గుడ్లను విక్రయించి పూట గడుపుతున్నారు. బుధవారం రాత్రి గుడారం బయట నిద్రిస్తున్న వెంకటేశ్వర్లుపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి హతమార్చాడు. గురువారం ఉదయం రక్తపుమడుగులో ఉన్న వెంకటేశ్వర్లును గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వైరా సీఐ టి.సురేశ్ పరిశీలించారు. స్థానికులను విచారించారు. భార్య మరియమ్మను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు మరియమ్మతో పాటు కల్లూరుకు చెందిన శివకృష్ణపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై పొదిల వెంకన్న తెలిపారు.