వైద్య సేవలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తికి భద్రాచలం ప్రజలు పట్టం కట్టారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన తెల్లం మూడో పర్యాయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో సీటును మాత్రమే గెలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్కుమార్ మాత్రమే బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. అదే ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో భద్రాచలం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన డాక్టర్ తెల్లం వెంకట్రావు.. ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
భద్రాచలం, డిసెంబర్ 3: భద్రాచలానికి చెందిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మూడో పర్యాయంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాథించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. వైఎస్ఆర్సీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో సుమారు 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
అయితే, గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటును మాత్రమే గెలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం వెంకట్రావు, 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్కుమార్ మాత్రమే బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. అదే ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో భద్రాచలం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన డాక్టర్ తెల్లం వెంకట్రావు.. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి ఆరు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. 13వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావుకు 52,612 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యకు 46,243 ఓట్లు వచ్చాయి. 5,719 ఓట్ల మెజారిటీ సాధించారు.
బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదివారం పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో ఆయన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై మంచి మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన పార్టీ భద్రాచలం ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. వారికి బ్రిడ్జి సెంటర్ వద్ద వేలాది మంది గులాబీ శ్రేణులు, ప్రజలు స్వాగతం పలికారు. మహిళా నాయకులు హారతులిచ్చారు. అనంతరం తెల్లం, మధు రామాలయానికి చేరుకొని రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేదాశీర్వచనం, స్వామివారి శేష వస్ర్తాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెళ్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు తాండ్ర వెంకట రమణారావు, తాళ్లపల్లి రమేశ్ గౌడ్, చుక్కా సుధాకర్, నర్రా రాము, దారపునేని రాంబాబు, గంగాభారతి, కేతినేని లలిత, ఒగ్గు అనురాధ, మానె కమల పాల్గొన్నారు.