ఖమ్మం, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):బీఆర్ఎస్ నేత, బలహీన వర్గాల నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొనేందు కోసం ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు గురువారం ఖమ్మం నగరంలో ‘కేసీఆర్కు కృతజ్ఞత’ పేరిట సభను నిర్వహించనున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న వద్దిరాజును ఘనంగా సన్మానించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మం బైపాస్రోడ్డులోని గాయత్రి గౌండ్స్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ‘కేసీఆర్కు కృతజ్ఞత’ సభ ప్రారంభం కానుంది.
సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బడుగు, బలహీన వర్గాల నేతగా గుర్తింపు పొందిన వద్దిరాజు రవిచంద్రకు మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
రెండేళ్ల క్రితం పార్టీ అధినేత కేసీఆర్.. వద్దిరాజు రవిచంద్రకు తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఆ పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 4తో అది ముగియనుంది. ఈ క్రమంలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ బలహీన వర్గాల నేతగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన వద్దిరాజుకు పార్టీ తరఫున మరోసారి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కల్పించారు. దీంతో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వద్దిరాజు ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ నేపథ్యంలో వద్దిరాజుకు మళ్లీ అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ జిల్లా నేతలు.. ‘కేసీఆర్కు కృతజ్ఞత’ పేరిట ఖమ్మంలో గురువారం భారీ సభను ఏర్పాటు చేశారు. యువనేత కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,
కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, మదన్లాల్, చంద్రావతి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొనున్నారు. రాజ్యసభ పదవిని వద్దిరాజుకు కేటాయించడం ద్వారా బడుగు బలహీన వర్గాలపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక అభిమానాన్ని చూపినట్లవుతుంది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో బడుగు బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలకు బీఆర్ఎస్ సత్తా చాటేలా పార్టీ నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు.