ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో ఘటన
రఘునాథపాలెం, డిసెంబర్ 6: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అయిన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదనే బాధతో బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో బుధవారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ కథనం ప్రకారం.. హర్యాతండా గ్రామానికి చెందిన మాళోతు బద్యా బీఆర్ఎస్ కార్యకర్తగా ఉంటూనే చిన్న రైతుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ విజయం సాధించకపోవడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోవడం వంటి కారణాలతో మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినా అప్పటి నుంచి దిగులుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం నాడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇంతలో బీఆర్ఎస్ నాయకులు కూడా విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బద్యా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు వీరూనాయక్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బద్యాను పలువురు బీఆర్ఎస్ నాయకులు చూసి అతడి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.