ఖమ్మం జనవరి 11: చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ మనపై ఉన్న నమ్మకంతో పార్టీ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు కరీంనగర్ సభ ఎలా చరిత్రలో నిలిచిపోయిందో.. అదే విధంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ స్వరాష్ట్రం సాధించారన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారన్నారు.
బహిరంగ సభకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. సభను నిర్వహించే అవకాశం మనకు దక్కడం అదృష్టమన్నారు. సభకు నాలుగు జిల్లాల నుంచి భారీగా ప్రజలు హాజరవుతారన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభమై 4.30 గంటలకు ముగుస్తుందన్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి 25 వేల మందిని సభకు తరలించేలా చూడాలన్నారు. వారికి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరాన్ని గులాబీమయం చేయాలన్నారు. నగరాన్ని ఐదు భాగాలుగా విభజించి ఏర్పాట్లు చేయాలన్నారు. సభ వేదిక బాధ్యతలను టీఎస్ఐడీసీ చైర్మన్ బాలమల్లు నిర్వహిస్తారన్నారు. ఆయనకు అసిస్టెంట్గా సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ వ్యవహరిస్తారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. నగరాన్ని గులాబీమయం చేసేందుకు కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, వీరూనాయక్, కుర్రా భాస్కర్రావు, చింతనిప్పు కృష్ణచైతన్య, దేవభక్తిని కిశోర్, మాటేటి కిరణ్, తొగరు భాస్కర్, ఇషాక్, అష్రిన్, ప్రసాద్, తన్నీరు శోభారాణి, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఖమ్మం సభ చరిత్రలో నిలవాలి : ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని నామా పిలుపునిచ్చారు. సభ ఎక్కడ నిర్వహించాలనే ఆలోచన పార్టీ అధినేత కేసీఆర్కు వచ్చినప్పుడు తాను, మంత్రి అజయ్ కలిసి ఆయన్ను ఖమ్మంలో నిర్వహించాలని కోరామన్నారు. కార్యకర్తలపై ఉన్న నమ్మకంతోనే సభ గురించి కేసీఆర్తో చర్చించామన్నారు. మనకు సంక్రాంతి పండుగ కాదని, 18న జరిగే సభే పండుగ కావాలన్నారు. ఆ రోజు యావత్ దేశ ప్రజలు ఖమ్మం వైపు చూస్తారన్నారు.