రఘునాథపాలెం, ఏప్రిల్ 19: ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ య సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు సభకు భారీగా తరలివచ్చారు. వీధులన్నీ గులాబీమయమయ్యాయి.
నాయకులు ఊహించిన దానికంటే అధికసంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, జోష్ను నింపే ప్రసంగాన్ని అందించాలనే ఉద్దేశంతో ఖమ్మంలో భారీ ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. శాసనసభాపక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ ఖమ్మంలో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారని, పార్టీ శ్రేణుల జోష్ చూస్తుంటే 2028 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమాను వ్యక్తంచేశారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీలుగా బయల్దేరి వచ్చారు.
మమత ఆసుపత్రి ప్రాంగణం మొత్తం గులాబీ శ్రేణులతో నిండిపోయింది. పలువురు ఆసుపత్రి ప్రాంగణం బయట ఉండి ఆసక్తిగా హరీశ్రావు ప్రసంగాన్ని విన్నారు. సుమారు 10వేల మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పసందైన విందు భోజనం అందించారు.