కారేపల్లి, అక్టోబర్ 1: ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి మూడో సారి కేసీఆర్ను సీఎంగా చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఫలాలు అందని కుటుంబం లేదని గుర్తు చేశారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లను పరుగెట్టిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. మదన్లాల్ను వైరా బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తూ దేవదూతగా పంపిచారన్నారు. పార్టీ ఆదేశాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వైరాలో మదన్లాల్ను ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకుగా ఇవ్వాలన్నారు.
ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అంటే తన కెంతో ఇష్టమని, ఆయన ఆదేశాలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మదన్లాల్తో కలిసి పనిచేస్తానని స్పస్టం చేశారు. మదన్లాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ టికెట్ను నాకు కేటాయించిన వెంటనే రాములు నాయక్ను నీ ఆశీస్సులు నాకు కావాలని అడగగానే చిరునవ్వుతో సాదరంగా, సానుకూలంగా స్పందించారన్నారు. ముందుగా కారేపల్లి చేరుకున్న ప్రజాప్రతినిధులకు మండల ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, నాయకులు తోటకూరి పిచ్చయ్య, రావూరి శ్రీనివాసరావు, ముత్యాల సత్యనారాయణ, హన్మకొండ రమేశ్, ఉన్నం వీరేందర్, నర్సింగ్ శ్రీనివాసరావు, బత్తుల శ్రీను, అడ్డగోడ ఐలయ్య, షేక్ గౌస్, అజ్మీర వీరన్న, దుగ్గినేని శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, తోటకూరి రాంబాబు, పాంఢ్యానాయక్, జడల వెంకటేశ్వర్లు, వసంత, బాగం నాగేశ్వరరావుతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.