ఖమ్మం, అక్టోబర్ 25: ‘ప్రజలే నా కుటుంబ సభ్యులు.. నా అన్నదమ్ముళ్లు.. అక్కాచెల్లెళ్లు.. వారి కోసం వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తున్నా.. వారి నుంచి నేనేమీ ఆశించలేదు. వారి సంక్షేమం కోసం మున్ముందు మరింత పనిచేస్తా..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో బుధవారం న్యాయవాది మల్లాది వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి.. అహంకారానికి మధ్య పోటీ జరుగుతున్నదన్నారు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అధికారులు, చిరుద్యోగులతో సైతం మర్యాదగా నడుచుకుంటున్నానన్నారు. ఇప్పటివరకు ఎవరినీ తులనాడలేదని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తాం..’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తుమ్మల తనను రజాకార్ ఖాసీం రజ్వీతో పోల్చడం హాస్యాస్పదమన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ అధిష్ఠానం తుమ్మలను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిందన్నారు. బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి గెలిపించిందని గుర్తుచేశారు. నాడు దర్జాగా పదవులు అనుభవించి నేడు నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై అవాకులు చెవాకులు పేలడం తుమ్మలకే చెల్లిందన్నారు. పాలేరు టికెట్ ఇవ్వనందుకే బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రజల కాళ్లు కడుగుతానని చెప్పిన తుమ్మల ఆ పనిలో నిమగ్నం కాకుండా, ఇప్పుడు ప్రజల కాళ్ల చెంతకు వెళ్లి ఓట్లు అభ్యర్థించే పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, నాయకులు వెంకట్రెడ్డి, ముత్తయ్య, హరిబాబు, కొండల్రావు, మేకల భిక్ష్మయ్య, వేములపల్లి వెంకటేశ్వరరావు, తవిడిశెట్టి హనుమంతరావు, పోట్ల శ్రీకాంత్, వల్లభనేని రామారావు, పగడాల నాగరాజు, కొండపల్లి శ్రీనివాస్, మాటూరి లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ధర్మారావు, తాటిబండ రఘునందన్, కోటేశ్వరరావు, పాలడుగు నాగేశ్వరరావు పాల్గొన్నారు.