బర్త్, డెత్ (జనన, మరణ) సర్టిఫికెట్లకు ఇక నుంచి మాన్యువల్ పద్ధతి లేదు.. పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు లేవు.. ఫోర్జరీలకు తావు లేదు.. నకిలీల బెడద లేదు.. ధ్రువపత్రాలు అవసరమైన వారు ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. పంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులే వాటిని విచారిస్తారు. పంచాయతీరాజ్శాఖ కేటాయించిన డిజటల్ ‘కీ’తో పత్రాలు జారీ చేస్తారు. సర్టిఫికెట్ జారీ అయినట్లు మొబైల్కు మెసేజ్ రాగానే దరఖాస్తుదారులు ‘మీ సేవ’లో పత్రం పొందవచ్చు. పల్లె ముంగిటకే పౌర సేవలు తీసుకురావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అశ్వారావుపేట, ఫిబ్రవరి 3: జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వస్తాయి. ఆయా సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు కొద్దిరోజుల్లోనే పత్రాలు చేతిలో పడతాయి. పంచాయతీరాజ్శాఖ సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నది.
నూతన విధానం ఇలా..
జనన, మరణ ధ్రువపత్రాల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడి మొబైల్కి ఐప్లె చేసిన వివరాలు మెసేజ్ రూపంలో అందుతాయి. ధ్రువపత్రం జారీపై అప్డేట్స్ వస్తాయి. ధ్రువపత్రం జారీ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రానికి వెళ్లి పత్రాలు తీసుకోవచ్చు.
కార్యదర్శులకు డిజిటల్ ‘కీ’..
పంచాయతీ కార్యదర్శులు ఇక నుంచి పంచాయతీ కార్యాలయాల ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు వారికి మండల పరిషత్ నుంచి సర్కార్ డిజిటల్ ‘కీ’ ఇచ్చింది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మండల స్థాయిలో ఎంపీడీవోల నేతృత్వంలో మండల పంచాయతీ అధికారులు సూపర్వైజ్ చేస్తారు.
పౌర సేవల్లో పారదర్శకత..
పౌరసేవల్లో పారదర్శకత తీసుకొచ్చి ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సులువైన పద్ధతిలో జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల వివరాలు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో 481 పంచాయతీలు..
భద్రాద్ర జిల్లావ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 481 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉండేది. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజల అవస్థలకు పుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించి డిజిటల్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. పారదర్శకతకు బాటలు వేసింది.
గ్రామాల్లోనే ధ్రువ పత్రాల జారీ..
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. దీనిలో భాగంగా పంచాయతీలకు కొన్ని అధికారాలు కేటాయించింది. ఇక నుంచి పంచాయతీ కార్యదర్శులే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం కేటాయించింది. డిజిటల్ ‘కీ’ విధానానికి శ్రీకారం చుట్టి ఫోర్జరీలు, నకిలీల బెడద లేకుండా చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే పత్రాలు అందుతాయి.
– విద్యాధర్రావు, ఎంపీడీవో, అశ్వారావుపేట