Sri Rama navami | భద్రగిరికి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. భద్రాచలంలో కొలువైన సీతారామచంద్రస్వామి కల్యాణ ముహూర్తానికి వేళ అయింది. రామయ్య సన్నిధిలో కల్యాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణంతోపాటు 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువు జరగనున్నది. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు ఈ సారి భక్తులు భారీగా తరలి రానుండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, అన్నిశాఖల అధికారులకు భద్రాచలంలో విధులు కేటాయించారు. వారు మంగళవారం విధుల్లో చేరనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27 (నమస్తే తెలంగాణ): భద్రగిరి కొండకు బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి వేళైంది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ సారి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నందున లడ్డూలు, తలంబ్రాలను సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ అధికారులందరికీ ఇప్పటికే విధులను ఖరారు చేశారు. మంగళవారం నుంచి వారు విధుల్లో చేరనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ దివ్యక్షేత్రంలో 1999, 2011లో పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా ఈ సారి మార్చి 31న జరుగనుంది.
కనులారా తిలకించేలా..
రామయ్య కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు ఇప్పుడిప్పుడే భద్రాచలం చేరుకుంటున్నారు. ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. ఆనవాయితీ ప్రకారం ఏపీలోని కారుకొండ భక్తులు ఈసారి కూడా గోటి తంలాంబ్రాలను తీసుకువచ్చారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని మరికొందరు భక్తులు కూడా కాలినడకన వచ్చి గోటి తలంబ్రాలు అందజేశారు. ఇక ఆలయ అధికారులు కూడా 200 క్వింటాళ్ల తలంబ్రాలను, 3 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. తలంబ్రాలకు 70, లడ్డూలకు 50 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ.కోటితో భద్రాద్రిని శోభాయమానంగా తీర్చిదిద్దారు.
నేటి నుంచి విధుల్లోకి అధికారులు..
నవమి, పట్టాభిషేకం వేడుకలను సక్సెస్ చేసేందుకు కలెక్టర్ అనుదీప్ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. మిథిలా స్టేడియంలో సెక్టార్కు ఒక జిల్లా అధికారిని నియమించారు. కల్యాణ క్రతువును భక్తులు కనులారా వీక్షించేలా ఆరు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 200 మంది ఈతగాళ్లను, 135 కంట్రిబోట్లను సిద్ధం చేశారు. సమస్య వస్తే తక్షణమే స్పందించేందుకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను అందుబాటులో ఉంచారు. 08743-232444 నెంబరును ఏర్పాటు చేశారు. ఆహ్వాన పత్రికలు, పోస్టర్లను హైదరాబాద్లో సీఎం కేసీఆర్తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఇటీవల ఆవిష్కరించారు. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు వెళ్లి మంత్రులతోసహా ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు.
జిల్లా వ్యాప్తంగా సమాచార కేంద్రాలు..
నవమికి ఎలా రావాలో భక్తులు తెలుసుకునేలా కోసం పౌరసంబంధాల శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సమాచార కేంద్రాలను అందుబాటులో ఉంచారు. 25 చోట్ల రూట్ మ్యాపులు ఉంచారు. కల్యాణ వేదికకు మార్గాలు, పార్కింగ్, తలంబ్రాలు, లడ్డూల కౌంటర్లు, టాయిలెట్లు, సమాచారం కేంద్రం వంటివి ఎక్కడెక్కడున్నాయో తెలిపేలా వీటిని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారి ఆచూకీ ఎలా తెలుసుకోవాలో, సమాచార కేంద్రాన్ని ఎలా సంప్రదించాలో అనే అంశాలపై డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు తయారు చేసిన ఆడియా సీడీని, పోస్టర్ను కలెక్టర్ అనుదీప్ ఆవిష్కరించారు.
ఆడియో సీడీలు ఆవిష్కరించిన కలెక్టర్
శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల కోసం భక్తులకు సౌకర్యార్థం తయారు చేసిన సమాచార పత్రాన్ని, భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై తయారు చేసిన ఆడియో సీడీని ఐడీవోసీలో సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తప్పిపోయిన వారి సమాచారం గురించి ఆర్డీవో కార్యాలయ కంట్రోల్ రూంలోగానీ, పోలీసు కంట్రోల్ రూంలోగానీ తెలియజేయాలన్నారు. 9441536060, 6301582152 నెంబర్లకు కాల్ చేసి పర్యవేక్షణ అధికారులైన వెంకటరమణ, వాల్యాలకు తెలియజేయాలని సూచించారు. అదపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు చాలా ప్రధానం
స్వచ్ఛ శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం ఉత్సవాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చాలా ప్రధానమైనవని కలెక్టర్ అనుదీప్ అన్నారు. బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్య విధులు నిర్వహించే ఎంపీవోలు, కార్యదర్శులకు ప్రత్యేక ఏకరూప దుస్తులను సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని సూచించారు. మొత్తం 400 మంది పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డీపీవో రమాకాంత్ పాల్గొన్నారు.
ముస్తాబవుతున్న పర్ణశాల ఆలయం
పర్ణశాల, మార్చి 27: రాములోరి కల్యాణ మహోత్సవానికి పర్ణశాల ఆలయంలో కూడా ముస్తాబవుతోంది. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా గవర్నర్ పర్యటన ఉండడంతో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్ణశాల ఆలయ అధికారులతోపాటు దుమ్ముగూడెం తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, సీఐ రమేశ్, సర్పంచ్ వరలక్ష్మి, ఇరిగేషన్ శాఖ అధికారులు రాజ్ సుహాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు.
నేడు గరుడ ధ్వజారోహణం
భద్రాచలం, మార్చి 27: భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జీయర్ మఠంలో గరుడ ధ్వజ పటాన్ని చిత్రీకరించారు. భక్తి ప్రపత్తులతో గరుడ ధ్వజ పటాన్ని ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రంం జీయర్మఠంలో శ్వేత వస్త్రంపై గరుత్మంతుని చిత్రాన్ని గీసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రామాలయానికి గరుడ ధ్వజ పటాన్ని మేళతాళాల నడుమ తీసుకొని వచ్చి గరుడాధివాసం నిర్వహించారు. మంగళవారం గరుడ ధ్వజారోహణం, బుధవారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.
కనులారా తిలకించాలి..
రామయ్య కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించేందుకు, స్వచ్ఛ నవమి జరుపుకునేందుకు నిరుటికంటే ఈ సారి మరిన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేశాం. జిల్లా అధికారులందరమూ కలిసి కల్యాణ క్రతువును సక్సెస్ చేస్తాం. వంద మంది కార్యదర్శులకు విధులు కేటాయించాం. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేశాం. టికెట్లు, తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాం. బస్సు సర్వీసులు పెంచాం.
-అనుదీప్, భద్రాద్రి కలెక్టర్