భద్రాచలం, డిసెంబర్ 23: ఆదివారం తెల్లవారుజాము.. భద్రాద్రి రామాలయ ఉత్తర ద్వారం వద్ద భక్తజన సంద్రం.. జగమేలు జగదభిరాముడి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ.. మెల్లమెల్లగా తెరచుకుంటున్న ద్వారాలు.. ‘ జై శ్రీరామ.. జై జై రామ..’ అని భక్తుల జయ జయ ధ్వానాలు.. మంగళ వాద్యాలు, వేద మంత్ర ఘోష ప్రతిధ్వనులు.. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ఆ క్షణాలు రానే వచ్చాయి.. సీతాలక్ష్మణ సమేతుడై రామయ్య తేజోస్వరూపుడిగా దర్శనమిచ్చారు.. అల వైకుంఠం ఇలకు దిగి వచ్చినట్లుగా భద్రగిరి పునీతమైంది.. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు. ఈ అపురూప ఘట్టం శనివారం భద్రాచలంలో ఆవిష్కృతమైంది. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై రామయ్య తండ్రి, గజ వాహనంపై సీతమ్మతల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. అంతకుముందు భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్తో అర్చకులు స్వామివారికి అభిషేకం చేయించారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు, అష్టోత్తర శతనామార్చన చేపట్టారు. చతుర్వేదాలు, గరుడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి, గజ్జ గరుడ దండకం, దాశరథి శతకాన్ని పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతినిచ్చారు. ఉదయం 6 గంటలకు తిరువీధి సేవ ప్రారంభమైంది. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదనరాజు, భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ డీఎస్పీలు రాఘవేంద్రరావు, కేవీ రమణమూర్తి, వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
పర్ణశాల, డిసెంబర్ 23: భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయ సన్నిధిలో శనివారం తెల్లవారుజామున ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారిని పల్లకీపై ఊరేగిస్తూ గ్రామ పురవీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. వేడుకలో ఎంపీడీవో ముత్యాలరావు, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, స్పెషల్ ఆఫీసర్ చంద్రమౌళి, సీఐ రమేశ్, అర్చకులు శేషకిరణ్కుమార్ చార్యులు, భరద్వాజాచార్యులు, రాజగోపాలాచార్యులు, అమరవాది శ్రీకాంతాచార్యులు, నరసింహాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలం, డిసెంబర్ 23: తమిళనాడులోని కొయంబత్తూరుకు చెందిన బాలాజీ, శారద దంపతులు భద్రాచలం సీతారామచంద్రస్వామికి రూ.45 లక్షల విలువైన 109 స్వర్ణ తులసీదళాలు చేయించారు. శనివారం వాటిని ఆలయ ఈవో రమాదేవికి అందించారు. దాతలను దేవస్థాన అధికారులు సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ప్రవీణ దంపతులు శనివారం భద్రాద్రి రామాలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నక్కా ప్రసాద్, మామిడి పుల్లారావు, హరిశ్చంద్రనాయక్, చావా లక్ష్మీనారాయణ, కురిచేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
భద్రాద్రి రామాలయ ఉత్తర ద్వారం దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్యను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ నందిని దర్శించుకున్నారు. అనంతరం అంతరాలయంలోని మూలవరులను దర్శించుకున్నారు.